ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, తెలుగు కామెంటేటర్ సీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. పవర్ ప్లేలో ధాటిగా ఆడేందుకు ధోనీ ఈ వ్యూహం అనుసరించవచ్చని తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఫేస్బుక్ వేదికగా ధోనీ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
'కొత్త సీజన్.. కొత్త పాత్ర' కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని, త్వరలోనే అప్డేట్ ఇస్తానని ఫేస్ బుక్లో ధోనీ ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగుతాడా? లేదా ఏదైనా యాడ్ కోసం ఇలా పోస్ట్ చేశాడా? సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ పోస్ట్పై ట్విటర్ వేదికగా స్పందించిన వెంకటేశ్.. మరో వాదనకు తెరలేపారు. 'నా అంచనా ప్రకారం ధోనీ రుతురాజ్తో కలిసి ఓపెనింగ్ చేయవచ్చు. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ధోనీ ఈ వ్యూహం అమలు చేయవచ్చు.'అని ట్వీట్ చేశారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్ సగం మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
దాంతో వెంకటేశ్ చెప్పిన వాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది. డెవాన్ కాన్వే స్థానంలో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ధోనీ ఓపెనింగ్ చేయవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో కాన్వే ఎడమ బొటనవేలికి తీవ్ర గాయమైంది. దాంతో అతను టెస్ట్ సిరీస్కు కూడా దూరమయ్యాడు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు న్యూజిలాండ్ మీడియా పేర్కొంది. అదే జరిగితే రెండు నెలల పాటు కాన్వే ఆటకు దూరం కానున్నాడు. కాన్వే స్థానాన్ని భర్తీ చేయగల ఓపెనర్లు చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నారు. వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానేతో పాటు రచిన్ రవీంద్రను ఓపెనర్గా ఆడించవచ్చు.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో రచిన్ రవీంద్రను సీఎస్కే రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ ఓపెనర్గా ఆడాలనుకుంటే మాత్రం రచిన్ మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడు.