న్యూఢిల్లీ: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.16.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను వదులుకునేందుకు చెన్నై మేనేజ్మెంట్ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2023 సీజన్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో 15 పరుగులే చేశాడు. బౌలింగ్లోనూ ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేసాడు. ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరం కాగా.. అతని స్థానంలో బరిలోకి దిగిన అజింక్యా రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో స్టోక్స్కు మళ్లీ అవకాశం దక్కలేదు.

గాయం కారణంగా అతను చాలా రోజులుగా బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆల్రౌండర్గా జట్టుకు కీలక సేవలందించడంతో పాటు ధోనీ అనంతరం జట్టును నడిపించగలడనే నమ్మకంతో సీఎస్కే అతనిపై కోట్లు కుమ్మరించింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫమయ్యాడు. ఏ విషయంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ను సంతృప్తి పరచలేకపోయాడు.
అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ కోసం తన రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుండగా.. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ టూర్లో మూడు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. అనంతరం ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే వరుసగా తీరికలేని క్రికెట్ ఆడాల్సి వస్తుండటంతో ఐపీఎల్ 2024కు దూరంగా ఉండాలని స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ను వదులు కోవడమే ఉత్తమమని సీఎస్కే భావిస్తోంది. అతని స్థానంలో ప్యాట్ కమిన్స్ను తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా అతను గతేడాది జరిగిన ఐపీఎల్ ఆడలేదు. గతంలో కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన అతను అసాధారణ బౌలింగ్, బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.