ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా ఐదో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. సన్రైజర్స్ హైదరాబాద్తో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో సగం మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఒకే ఒక్క విజయం సాధించింది. అద్భుతాలు జరిగితే తప్పా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే పరిస్థితి లేదు. మిగిలిన ఏడు మ్యాచ్లకు ఏడు గెలిస్తే తప్పా ఆర్సీబీ టోర్నీలో ముందంజ వేయలేదు.

ఫాఫ్ ప్లాఫ్ షో..
అయితే ఆర్సీబీ పరాజయాలకు పేలవ బ్యాటింగ్, బౌలింగ్తో పాటు చెత్త కెప్టెన్సీ కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా పిచ్ను రీడ్ చేయడంలో ఫాఫ్ డుప్లెసిస్ విఫలమవుతున్నాడు. దాంతో టాస్ గెలిచినా ప్రత్యర్థి జట్టుకే అడ్వాంటేజ్గా మారుతోంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉందని చెప్పాడు. కానీ ఈ వికెట్పై పరుగుల వరద పారింది. ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
సరైన కాంబినేషన్ లేక..
తుది జట్టు ఎంపికలోనూ ఫాఫ్ డుప్లెసిస్ తడబడుతున్నాడు. ప్రతీ మ్యాచ్కు తుది జట్టును మార్చుతున్నాడు. పిచ్, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తగ్గట్లు ఆటగాళ్లను తీసుకోలేకపోతున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఒక్క స్పిన్నర్ను కూడా తీసుకోలేదు. పూర్తి పేసర్లతో బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నాడు.
స్పిన్నర్లు అయిన మ్యాక్స్వెల్, కర్ణ్ శర్మ, మయాంక్ దగర్లతో ఎక్కువ బౌలింగ్ చేయించడం లేదు. కొన్ని మ్యాచ్ల్లో మయాంక్ దగర్ కట్టడిగా బౌలింగ్ చేశాడు. అయినా అతని పూర్తి కోటా ఇవ్వడం లేదు.
ఒత్తిడికి చిత్తవుతూ..
పేసర్ల వైఫల్యంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఫాఫ్ డుప్లెసిస్.. ఫీల్డ్ ప్లేస్మెంట్, బౌలింగ్ మార్పుల్లోనూ తడబడుతున్నాడు. ఆర్సీబీ బౌలర్లు సైతం కండిషన్స్ను త్వరగా అందిపుచ్చుకోలేకపోతున్నారు. బౌలింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై కూడా సరైన లెంగ్త్లో వేస్తే ఫలితం రాబట్టవచ్చు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. అదే చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ ఆటగాళ్లు అనవసర ఒత్తిడికి గురై మ్యాచ్ను చేజార్చుకుంటున్నారు.