IPL 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకోవడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేసిన అతిపెద్ద తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. కామెరూన్ గ్రీన్ గొప్ప ఆటగాడే అయినా అతని అవసరం ఆర్సీబీకే లేదని అభిప్రాయపడ్డాడు.
కామెరూన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ.17.5 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ తీసుకుంది. హార్దిక్ పాండ్యా కోసం ముంబై ఇండియన్స్.. కామెరూన్ గ్రీన్ను ఆర్సీబీకి అమ్మేసింది. అయితే బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న ఆర్సీబీ.. స్పెషలిస్ట్ బౌలర్ కోసం చూడకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ను తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బ్రాడ్ హగ్ తెలిపాడు.

'కామెరూన్ గ్రీన్ కోసం అంత ధర పెట్టి తీసుకోవడం అవసరమా? ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను చూస్తే వారు తీసుకున్న నిర్ణయం గొప్పదేమీ కాదనిపిస్తోంది. అయితే ఇక్కడ కామెరూన్ గ్రీన్ టాలెంట్ను తక్కువ చేయడం లేదు. ముంబై ఇండియన్స్ తరఫున గతేడాది మంచి ప్రదర్శన చేశాడు. అయితే, ఆర్సీబీలో ఆటగాళ్ల జాబితాను తీసుకుంటే.. ఇప్పటికే బ్యాటింగ్ లైనప్ కోసం ఆ జట్టు భారీగా ఖర్చు పెట్టింది.
కానీ, నాణ్యమైన బౌలర్ల కోసం తగినంత నిధులు వారి వద్ద లేవు. ఆర్సీబీ టైటిల్ గెలవాలనుకుంటే బౌలర్లపై ఫోకస్ పెట్టాలి. భారీ లక్ష్యాలను కాపాడుకోవాలంటే బౌలర్ల పాత్ర అత్యంత కీలకం. కామెరూన్ గ్రీన్ ఆర్సీబీకి ఏమాత్రం సరిపోయే ఆటగాడు కాదు.
హార్దిక్ పాండ్యా కోసమే ముంబై ఇండియన్స్ కామెరూన్ గ్రీన్ను వదిలేసింది. కాస్త ఎక్కువైనా సరే ఆల్రౌండర్ను తీసుకోవాలని ఆర్సీబీ భావించినట్లుంది'అని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన కామెరూన్ గ్రీన్ 452 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీకి మిడిలార్డర్లో సరైన ఆటగాడు లేక గత రెండు సీజన్లలో ఇబ్బంది పడింది. ఆ సమస్యను అధిగమించేందుకే కామెరూన్ గ్రీన్ను తీసుకుంది. కానీ ఆ జట్టు విదేశీ ఆల్రౌండర్ కంటే స్వదేశీ ఆల్రౌండర్పై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.