'మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుంది' ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్ హెర్నీయా సర్జీరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు సూర్యకుమార్ యాదవ్కు మరింత సమయం పట్టనుంది. ఇప్పటికే బీసీసీఐ అధికారులు నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో సూర్య విఫలమయ్యాడు. జూన్లో టీ20 ప్రపంచకప్ 2024 ఉండటంతో సూర్య విషయంలో బీసీసీఐ చాలా కేర్ తీసుకుంటుంది.

ఎలాంటి తొందరపాటు అవసరం లేకుండా పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే ఐపీఎల్ ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సూర్య.. ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం అతను మరికొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉందని ఎన్సీఏకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు. 'సూర్య వేగంగా కోలుకుంటున్నాడు. అతి త్వరలోనే అతని ఐపీఎల్ 2024 బరిలో నిలవనున్నాడు. ముంబై ఆడిన తొలి రెండు మ్యాచ్లకు దూరమైన సూర్య.. రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్ లేని లోటు ముంబై ఇండియన్స్లో స్పష్టంగా కనబడుతోంది. గత రెండు మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. గుజరాత్ టైటాన్స్తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న ముంబై.. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 31 పరుగుల తేడాతో చిత్తయ్యింది. గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు.