ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సన్నదమవుతోంది. టైటిలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్ను నిర్వహిస్తోంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో సోమవారం రెండో ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఆటగాళ్లు రెండు గ్రూప్లుగా విడిపోయి తలపడ్డారు.
సన్రైజర్స్ ఏ వర్సెస్ సన్రైజర్స్ బీ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబర్చారు. సన్రైజర్స్ బీ టీమ్ తరఫున బరిలోకి దిగిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్(3/32) మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఏ టీమ్ తరఫున తెలుగు తేజం, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 26 బంతుల్లో 56 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ బీ టీమ్.. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 73), రాహుల్ త్రిపాఠి (28 బంతుల్లో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో రాణించడంతో 19 ఓవర్లలో 197 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లతో పాటు హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. సన్రైజర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఐపీఎల్ 2024 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. మార్చి 23న కోల్కతా వేదికగా కేకేఆర్తో జరిగే మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది.