ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను రూపొందించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మల్లగుల్లాలు పడుతోంది. సరిగ్గా ఐపీఎల్ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో షెడ్యూల్ను ఖరారు చేయలేకపోతుంది. లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత.. ఆ తేదీలను బట్టి షెడ్యూల్ను ప్రకటించాలనుకుంటోంది.
మార్చి 22 నుంచి మే 30 మధ్య ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడని నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను రెండు దశల్లో ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి.

కొన్ని మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించే అవకాశాలను కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ వేదికగానే మ్యాచ్లను పూర్తి చేసేందుకు బీసీసీఐ ప్రాధాన్యత ఇస్తుందని ఓ అధికారి తెలిపాడు. 'ఐపీఎల్ షెడ్యూల్కు సంబంధించిన చర్చలు, ప్రణాళికలు జరుగుతున్నాయి. ఎన్నికల డేట్స్ విషయంలో క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాలనుకుంటున్నాం.
అయితే ఎన్నికల నొటిఫికేషన్కు మరింత ఆలస్యమైతే ఐపీఎల్ షెడ్యూల్ను దశల వారిగా ప్రకటిస్తాం. ఎవరూ కూడా ఐపీఎల్ దేశం ధాటి పోవాలనుకోవడం లేదు. అతి త్వరలోనే ఐపీఎల్ షెడ్యూల్ను ఖరారు చేస్తాం'అని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ గురించి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపాడు.
ఇక ఏప్రిల్ మిడిల్ వీక్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఐపీఎల్ నిర్వహిద్దామనుకున్నా.. బీసీసీఐకి అవకాశం లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్లో టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది.
ఎన్నికల తేదీలు వెలువడితే.. ఆ తేదీల్లో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగే రాష్ట్రాల్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మ్యాచ్లకు పోలీసు భద్రత సరిపోదు. ఈ క్రమంలోనే షెడ్యూల్ రూపకల్పనపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ తగ్గట్లుగా ఐపీఎల్ ఫస్టాఫ్ లేదా సెకండాఫ్ను విదేశాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తోంది. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్ సౌతాఫ్రికా వేదికగా జరగ్గా.. 2014లో ఫస్టాఫ్ లీగ్ దుబాయ్లో జరిగింది.