వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ముగియడంతో ఐపీఎల్ 2024 సీజన్ సందడి మొదలైంది. వచ్చే నెల 19న ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. ఈ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
క్యాష్ ట్రేడింగ్ ద్వారా తమ మాజీ ప్లేయర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకే గాలం వేసింది. అతని కాంట్రాక్ట్ వాల్యూ అయిన రూ. 15 కోట్లు చెల్లించి జట్టులోకి తెచ్చుకుంటోంది. హార్దిక్ పాండ్యాను తెచ్చుకునేందుకు ముంబై ఇండియన్స్ అతనితో పాటు గుజరాత్ టైటాన్స్కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్.. చివరి దశలో ఉండటంతో అతనికి బ్యాకప్గా హార్దిక్ పాండ్యాను సిద్దం చేయాలని ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ ఆల్రౌండర్ జట్టులో ఉంటే టీమ్ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవుతోందని, పూర్వ వైభవాన్ని అందుకోవచ్చని ఆ జట్టు భావిస్తోంది.
హార్దిక్ పాండ్యా కోసం గత వేలంలో రూ. 17.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్తో పాటు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్లను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. 2022 మెగా వేలంలో రూ. 8 కోట్లు పెట్టి జోఫ్రా ఆర్చర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్ ఆడడని తెలిసినా.. అతనిపై అంత ధర పెట్టి రిస్క్ చేసింది.

ఐపీఎల్ 2023 సీజన్లో అతను రీఎంట్రీ ఇచ్చినా అంతగా ప్రభావం చూపకపోవడం... మళ్లీ గాయాల బారిన పడటంతో ఆర్చర్ను వదులుకోవడమే ఉత్తమమని భావిస్తోంది. కామెరూన్ గ్రీన్ స్థానాన్ని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని భావించిన ముంబై.. క్యాష్ ట్రేడ్ ద్వారా అతని సొంతం చేసుకుంది.
కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్లను వదిలేయడం ద్వారా ముంబైకి పర్స్ మనీలో రూ.25.50 కోట్లు మిగులుతాయి. ఇందులో నుంచి హార్దిక్ పాండ్యాకు రూ. 15 కోట్లు ఇచ్చినా.. మరో రూ.10.50 కోట్లు ఉంటాయని, ఈ డబ్బులతో మినీవేలంలో కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.

ఆదివారంతో ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన ట్రేడింగ్ విండోతో పాటు రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించే గడువు ముగుస్తోంది. ఆదివారం సాయంత్రానికల్లా పది ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ జాబితాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.
ముంబై ఇండియన్స్.. కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్లతో పాటు జట్టుకు భారంగా మారిన క్రిస్ జోర్డాన్, డౌన్ జాన్సెన్, ట్రిస్టాన్ స్టబ్స్, అర్షద్ ఖాన్లను వదులుకునేందుకు కూడా సిద్దమైంది. సత్తా కలిగిన యువ ఆటగాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్.. వారిపైనే వేలంలో ఫోకస్ పెట్టనుంది.
ఐపీఎల్ 2023 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన టీమిండియా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ముంబై ఇండియన్స్ వదులుకునే ఆటగాళ్ల జాబితా:
కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లు
జోఫ్రా ఆర్చర్- రూ. 8 కోట్లు
క్రిస్ జోర్డాన్- రూ. 50 లక్షలు
డౌన్ జాన్సెన్- రూ. 20 లక్షలు
ట్రిస్టాన్ స్టబ్స్- రూ. 20 లక్షలు
అర్షద్ ఖాన్- రూ. 20 లక్షలు