IPL 2024 Auction: వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమకు అనవసరమైన ఆటగాళ్లను వదులుకోగా.. ఈ క్యాష్ రీచ్ లీగ్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1166 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 336 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండగా.. 202 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారున్నారు. మరో 45 మంది అసోసియేట్ నేషన్ ఆటగాళ్లున్నారు. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 10 ఫ్రాంచైజీల్లో కలిపి 77 ఖాళీలు ఉండగా.. ఇందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు ఉన్నాయి.

ఈ సారి వేలంలో స్టార్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ వరల్డ్ బిగ్గెస్ట్ టీ20 క్రికెట్ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ట్రావిస్ హెడ్తో పాటు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ తమ కనీస ధర రూ.2 కోట్లగా పేర్కొంటూ రిజిస్టర్ చేసుకున్నారు.
భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, కేదార్ జాదావ్లు సైతం ఈ జాబితాలో ఉన్నారు. వన్డే ప్రపంచకప్లో సత్తా చాటిన కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి అతను అమ్ముడయ్యే అవకాశాలున్నాయి.
రిజిస్టర్ చేసుకున్న 1,166 మంది నుంచి ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చిన వారితో బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేయనుంది. ఈ షార్ట్ లిస్ట్లోని పేర్లను వేలం వేయనున్నారు.