ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అనూహ్యంగా పుంజుకుంది. ఫస్టాఫ్ సీజన్లో వరుస ఓటములతో చతికిల పడిన ఆర్సీబీ.. సెకండాఫ్లో మాత్రం దుమ్మురేపుతోంది. తొలి 8 మ్యాచ్ల్లో ఒక్క విజయమే నమోదు చేసిన ఆర్సీబీ.. తర్వాతి ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచింది.
దాంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 47 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్సీబీ రన్రేట్ కూడా మెరుగుపరుచుకుంది.

అయితే ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వావ్.. అంటూ దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నట్లుగా అనుష్క శర్మ చేతులు జోడించి ఆర్సీబీ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్నారు. అనుష్కవైపు మజిల్స్ చూపిస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండటంతోనే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు భావోద్వేగానికి గురయ్యారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇటీవల అనుష్క-కోహ్లీ దంపతులకు అకాయ్ జన్మించిన విషయం తెలిసిందే. ప్రసవం అనంతరం లండన్ నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన అనుష్కశర్మ.. ఆర్సీబీ ఆడే మ్యాచుల కోసం స్టేడియానికి వస్తూ తన భర్తను ఉత్సాహపరుస్తోంది.
ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించడం లేదా.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ కంటే మెరుగైన రన్రేట్ సాధించి ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇంటి బాట పడుతోంది.