టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి తెరలేచింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పును తప్పుబడుతూ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే చేసిన కామెంట్పై సోషల్ మీడియా వేదికగా దూమారం రేగుతోంది.
కోహ్లీ, రోహిత్ అభిమానులు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దాంతో అనుష్క, రితికాలు ఎక్స్ వేదికగా ట్రెండింగ్లో నిలిచారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను వివరించాడు.

ఇది క్రికెట్కు సంబంధించిన నిర్ణయేనని, ఉద్దేశపూర్వకంగా తీసుకున్నది కాదని స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని అభిమానులు అర్థం చేసుకోలేకపోతున్నారని, భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్కు రితికా సజ్దే స్పందించింది. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అని నిర్మోహమాటంగా కామెంట్ చేసింది.
అయితే ఈ కామెంట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రోహిత్ అభిమానుల గొడవకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. రితికా సజ్దే కామెంట్ను హైలైట్ చేస్తూ వారు ముంబై ఇండియన్స్పై విమర్శలు గుప్పించగా.. కోహ్లీ అభిమానులు జోక్యం చేసుకొని కౌంటరిచ్చారు. టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి కూడా విరాట్ కోహ్లీని ఇలానే అనవసరంగా తప్పించారని గుర్తు చేశారు.
ఆ సమయంలో అనుష్క శర్మ.. రితికాలా? ఏడ్వలేదని, ఒక్క పోస్ట్ కూడా చేయలేదని గుర్తు చేస్తూ రితికాపై విమర్శలు గుప్పించారు. ఈ పోస్ట్లకు రోహిత్ ఫ్యాన్స్ కూడా కౌంటరిస్తున్నారు. పేలవ ఫామ్తో కోహ్లీ సతమతమైనప్పుడు అనుష్క అతనికి అండగా పోస్ట్లు పెట్టిందని, రితికా కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించిందని బదులిస్తున్నారు.
అయితే అనుష్క కోహ్లీ పేలవ ఫామ్ గురించి మాట్లాడలేదని, గవాస్కర్ చిల్లర కామెంట్లకు మాత్రమే బదులిచ్చిందని కోహ్లీ ఫ్యాన్స్ కౌంటరిచ్చారు. దాంతో రితికా, అనుష్క పేర్లు ట్రెండింగ్లో నిలిచాయి. అనుష్క శర్మతో పోల్చుకునే స్థాయి రితికాదు కాదని, రోహిత్ సతీమణిగానే ఆమెకు గుర్తింపు ఉందని, కానీ అనుష్క బాలీవుడ్ హీరోయిన అనే విషయం మరిచిపోవద్దని కోహ్లీ ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు.
టీమిండియా భవిష్యత్తు కోసం కోహ్లీని తప్పించినప్పుడు.. ముంబై ఫ్యూచర్ కోసం రోహిత్ను తప్పించడంలో ఎలాంటి తప్పిదం, అన్యాయం లేదని స్పష్టం చేస్తున్నారు.