ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసాధారణ పోరాటం ముగిసింది. ఈ సారి కూడా అభిమానులకు కన్నీళ్లనే మిగిల్చింది. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టిన ఆర్సీబీ.. కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. బుధవారం ఎలిమినేటర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది.
వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ పూర్తిగా మారే అవకాశం ఉంది. గరిష్టంగా నలుగురి ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉండనుండటంతో కీలక ఆటగాళ్లందరూ జట్టుకు దూరం కానున్నారు. 40 ఏళ్లకు చేరిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను రిటైన్ చేసుకోవడం కూడా సందేహమే. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫాఫ్ డుప్లెసిస్, ఆండీ ఫ్లవర్ సేవలు ముగిసినట్లేనని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సీజన్కు ముందే ఆండీ ఫ్లవర్ను ఆర్సీబీ తమ హెడ్ కోచ్గా నియమించుకుంది. సుదీర్ఘ కాలం కోచ్గా పని చేసిన మైక్ హెస్సెన్ను కాదని ఆండీ ఫ్లవర్ను తీసుకుంది.
అతని పర్యవేక్షణలో ఆర్సీబీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. సెకండాఫ్ టోర్నీలో సంచలన విజయాలు సాధించినా.. కీలక పోరులో చేతులెత్తేయడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తోంది. కేకేఆర్ తరహాలో స్వదేశీ కోచ్ను నియమించుకోవాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఫాఫ్ డుప్లెసిస్ వయసు దృష్ట్యా అతన్ని ఒక్క, రెండు సీజన్ల కోసం రిటైన్ చేసుకొని రిస్క్ చేయలేదు. ఈ క్రమంలోనే ఫాఫ్ డుప్లెసిస్ను కూడా వదులుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్ మినహా అందర్నీ వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది.