టీమిండియా సారథి, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యంపై మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫ్రాంచైజీ మారుతాడనే వార్తలపై తనదైన శైలిలో స్పందించాడు.
ఫ్రాంచైజీ మార్పు అనేది రోహిత్ శర్మ ఇష్టమని, ఏ జట్టులోకి వెళ్తానన్నా.. ఆ ఫ్రాంచైజీ అతన్ని నెత్తిన పెట్టుకోవడంతో పాటు సారథ్య బాధ్యతలు ఇస్తుందని తెలిపాడు.

ఆర్సీబీలోకి రోహిత్ శర్మ వెళ్తాడా? అనే ప్రశ్నపై రాయుడు తనదైన శైలిలో స్పందించాడు. ఆర్సీబీకి రోహిత్ శర్మ అవసరం ఉందో లేదో తెలియదు కానీ.. రిపోర్టర్స్కు మంచి హెడ్డింగ్ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నారని బదులిచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రియాన్ లారాతో కలిసి పాల్గొన్న రాయుడు.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఆర్సీబీకి రోహిత్ శర్మ అవసరం ఉందో లేదో తెలియదు కానీ.. మీకు ఓ మంచి హెడ్డి కోసం ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ శర్మ వెళ్లాలని భావిస్తే.. అతని కోసం ఫ్రాంచైజీలన్నీ ఎగబడుతాయి. అయితే ముంబై జట్టును వీడాలా? లేదా? అనేది రోహిత్ శర్మదే తుది నిర్ణయం.
ఒకవేళ అతను ఆ జట్టును వీడాలనుకుంటే మాత్రం మిగతా ఫ్రాంచైజీలన్నీ అతన్ని తీసుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటాయి. ప్రస్తుత ఫ్రాంచైజీ కన్నా రోహిత్ శర్మను మెరుగ్గా చూసుకుంటాయి.'అని రాయుడు తెలిపాడు. రోహిత్ శర్మ పట్ల ముంబై ఇండియన్స్ సరిగ్గా వ్యవహిరంచడం లేదని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.
ఇక ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అభిమానులైతే ప్రతీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను గేలి చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడుతాడనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.