ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆ జట్టు మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ప్రత్యేక విందు ఇచ్చాడు. సీఎస్కే ఆటగాళ్లను తన నివాసానికి ఆహ్వానించిన రాయుడు.. వారికి హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ట్రీట్ ఇచ్చాడు.
రాయుడి ఆతిథ్యానికి ఫిదా అయిన చెన్నై ఆటగాళ్లు.. అతని బిర్యానీకి కితాబిచ్చారు. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్.. రాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఉప్పల్ మైదానం వేదికగా ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ సీజన్ను గెలుపుతో ప్రారంభించిన చెన్నై.. అదే జోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది.
హోమ్ గ్రౌండ్లో చెలరేగిన సీఎస్కే.. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.
మరోవైపు కోల్కతా వేదికగా కేకేఆర్ చేతిలో ఓడిన సన్రైజర్స్.. సొంతగడ్డపై భారీ విజయాన్ని నమోదు చేసింది. పటిష్ట ముంబై ఇండియన్స్ను చిత్తు చేయడంతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి ఆల్టైమ్ రికార్డు దక్కించుకుంది. అయితే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఆ జట్టు ఆ జోరు కొనసాగించలేకపోయింది.
ఈ క్రమంలోనే సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధోనీ ఆడుతున్న చివరి సీజన్ కావడంతో ఈ మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ అభిమానులు ఎగబడ్డారు. క్షణాల్లో టికెట్లు అయిపోగా.. బ్లాక్ మార్కెట్లో ఒక్కో టికెట్ భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.