ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఎప్పటికీ టైటిల్ గెలవలేదని టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు అన్నాడు. గత 16 ఏళ్లుగా ఆర్సీబీ ఒకే తప్పిదం చేస్తుందని, ఈ మిస్టేక్ను సరిచేసుకోని వరకు ఆ జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కవని తెలిపాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ శతక్కొట్టినా విజయాన్ని అందుకోలేకపోయింది.

గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఈ సీజన్లో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ సమయంలో ఆర్సీబీ వైఫల్యం స్పందించిన రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్ల కారణంగానే గత 16 ఏళ్లుగా ఆర్సీబీ కప్ గెలవలేకపోతుందని రాయుడు అభిప్రాయపడ్డాడు.
'ఆర్సీబీ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. ఇక బ్యాటింగ్ విభాగం కూడా సరైన ప్రదర్శన చేయడం లేదు. స్టార్ ఆటగాళ్లంతా టాపార్డర్లో ఆడుతుండటంతో కుర్రాళ్లపై ఒత్తిడి పడుతోంది. కీలక సమయాల్లో.. తీవ్ర ఒత్తిడిలో కుర్రాళ్లు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
భారీ ధర పలికిన అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లంతా టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వారంతా డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమవుతున్నారు. దాంతో కుర్రాళ్లు ఒత్తిడిలో రాణించలేకపోతున్నారు. గత 16 ఏళ్లుగా ఆ జట్టులో ఇదే జరుగుతోంది. వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ లోయరార్డర్లో కొన్ని మ్యాచ్ల్లో రాణిస్తున్నా.. మరో ఎండ్లో అతనికి సరైన సహకారం లభించడం లేదు.
కొన్ని మ్యాచ్ల్లో గెలిపించినా.. మరికొన్ని మ్యాచ్ల్లో మాత్రం విఫలమవుతున్నాడు. కఠిన సమయాల్లో ఆర్సీబీ సీనియర్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఉండరు. ఇలాంటి జట్టు ఎప్పటికీ టైటిల్ గెలవలేదు. ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడానికి ప్రధాన కారణం ఇదే." అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
సీఎస్కేతో తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ.. పంజాబ్పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కేకేఆర్, లక్నో, రాజస్థాన్ చేతిలో వరుసగా చిత్తయ్యింది. జట్టులో కోహ్లీ మినహా మరే బ్యాటర్ రాణించడం లేదు.