సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా జట్టులోని ఆటగాళ్లందరిని సమంగా చూడటం.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జట్టు మొత్తం ఒకేలా ఉండటం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సక్సెస్ సీక్రెట్ అని ఆ జట్టు మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్తో మాట్లాడిన రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని తెలిపాడు.

70 రన్స్కే ఆర్సీబీ ఆలౌట్..
'2019లోనే సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య సీజన్ ఓపెనర్ మ్యాచ్ జరిగింది. చెపాక్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఆర్సీబీ 70 పరుగులకే కుప్పకూలింది. అయితే అప్పుడు పిచ్ చాలా చెత్తగా ఉంది. కానీ ఇప్పుడు చెపాక్ వికెట్స్ చాలా మెరుగయ్యాయి. కాబట్టి ఐపీఎల్ 2024 సీజన్ ఓపెనర్ మంచి మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా. రెండు టీమ్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో సీఎస్కే గెలుస్తుందనేది నా నమ్మకం.
చెన్నైకి ఆడే ప్రతీ ఆటగాడిని ఆ ఫ్రాంచైజీ తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తోంది. మంచి వాతావరణంలో జట్టును ఉంచుతారు. ఆటగాళ్లందరినీ సమంగా చూస్తారు. వారి ఫ్యామిలీస్ను మంచిగా చూసుకుంటారు. గెలుపు, ఓటములతో జట్టు వాతావరణం మారదు. టీమ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందర్నీ సంతోషంగా ఉంచుతారు. ఆటగాళ్లు సంతోషంగా ఉంటారు కాబట్టి మంచి ప్రదర్శన చేస్తారు.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీ నేర్పించారు..
సీఎస్ కెప్టెన్సీ మార్పుపై స్పందిస్తూ.. 'సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను నియమించాలని మేనేజ్మెంట్ ముందే భావించింది. గతేడాదిన్నరగా.. అతన్ని గ్రూమ్ చేస్తున్నారు. కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్.. దగ్గరుండి కెప్టెన్సీ నేర్పించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలు చెప్పారు. గత 15 ఏళ్లుగా ధోనీ ఎలా జట్టును నడిపించాడో.. మరో 10 ఏళ్ల పాటు రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేను అలానే విజయపథంలో నడిపించగలడు.'అని రాయుడు తెలిపాడు. ఈ సీజన్ జబర్దస్త్ జాతరాలా సాగనుందని రాయుడు అభిప్రాయపడ్డాడు.