IPL 2024: ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్ సరైనోడని టీమిండియా మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా అన్నాడు. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పిస్తే హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2024 మినీ వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ డీల్తో ట్రేడ్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా వేలం ధర రూ. 15 కోట్లతో పాటు భారీ మొత్తంలో ట్రాన్స్ఫర్ ఫీజును చెల్లించి మరీ జట్టులోకి తీసుకుంది. రెండు సీజన్ల తర్వాత హార్దిక్ పాండ్యా సొంత గూటికి చేరడంతో ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కెప్టెన్పై ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

రోహిత్ శర్మకు బ్యాకప్గానే హార్దిక్ పాండ్యాను తీసుకున్నారని, సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అప్కమింగ్ సీజన్లో రోహిత్ శర్మ సారథ్యం వహించినా.. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యానే జట్టును నడిపిస్తాడని వార్తలు వచ్చాయి.
ఓ చానెల్లో ఈ వ్యవహారంపై చర్చించిన అజేయ జడేజా.. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్కు అప్పగించాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం రోహిత్ శర్మ ఫిట్గా ఉండాలని, ఐపీఎల్ 2024 సీజన్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నాడు. రోహిత్ శర్మతో పాటు ఇతర భారత ఆటగాళ్లు కూడా టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2024 ఆడకుండా దూరంగా ఉండాలన్నాడు.
'ఐపీఎల్ 2024 సీజన్లో ఆడకుండా రోహిత్ శర్మ బ్రేక్ తీసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును నడిపించాలి. ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే భారత ఆటగాళ్లు ఐపీఎల్కు బ్రేక్ తీసుకొని ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలి. చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఇదే చేస్తున్నారు.

మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లు నేషనల్ కమిట్మెంట్స్ కోసం ఐపీఎల్కు దూరంగా ఉన్నారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఎవరూ ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకోరు. కనీసం అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసమైనా ఐపీఎల్ 2024 సీజన్కు దూరంగా ఉండాలి.'అని అజేయ్ జడేజా వ్యాఖ్యానించాడు.
భారత్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుందామనుకున్నా.. బీసీసీఐ ఒప్పుకోదు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ఆడకుంటే తమకే నష్టమని భావిస్తోంది. అవసరమైతే ద్వైపాక్షిక సిరీస్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తోంది.