ముంబై: రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1000వ ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. ఈ ప్రత్యేకమైన మ్యాచ్లో సెంచరీ బాదిన ప్లేయర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్లతో 124 పరుగులతో రాజస్థాన్ రాయల్స్కు 212 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కెరీర్లో తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న యశస్వీ.. ఈ ఘనతను అందుకున్న నాలుగో అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో మనీశ్ పాండే అగ్రస్థానంలో ఉండగా.. రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్ యశస్వీ కన్నా ముందున్నారు.

19 ఏళ్ల 253 రోజుల వయసులో మనీశ్ పాండే సెంచరీ బాదాడు. రిషభ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా.. పడిక్కల్ 20 ఏళ్ల 289 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. యశస్వీ జైస్వాల్ 21 ఏళ్ల 125 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీ అందుకున్నాడు. అండర్ -19 వరల్డ్కప్లో సెంచరీ బాదిన యశస్వీ.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ బాదిన యశస్వీ.. భారత్ ఏ తరఫున కూడా శతక్కొట్టాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లో బ్రెండన్ మెక్కల్లమ్ కేకేఆర్ తరఫున సెంచరీ నమోదు చేయగా.. 1000వ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ శతకం సాధించడం గమనార్హం. ఈ అసాధారణ రికార్డులతో యశస్వీ జైస్వాల్పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఈ యువ క్రికెటర్ను కొనియాడుతున్నారు. టీమిండియా భవిష్యత్తు స్టార్ అని ప్రశంసిస్తున్నారు.