హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. అత్యంత చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ల్లో నాలుగు మాత్రమే గెలిచిన హైదరాబాద్.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు పేపర్పై చాలా బలంగా కనబడిన సన్రైజర్స్.. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగింది.
బ్రియాన్ లారా పర్యవేక్షణ.. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ.. వేలంలో కోట్లు కొల్లగొట్టిన హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్తో పాటు పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఎంతో అనుభవమున్న భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో టీమ్ పటిష్టంగా కనిపించింది. కానీ ఆటలో మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

మహా భారతంలో కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్లు ఐపీఎల్ 2023 సీజన్లో ఆరెంజ్ ఆర్మీ ఫ్లాఫ్ షోకి అన్నే తప్పిదాలు ఉన్నాయి. చెత్త కోచింగ్తో పాటు పేలవ కెప్టెన్సీ, స్టార్ ఆటగాళ్ల వైఫల్యం టీమ్ను నట్టేట ముంచేసాయి. సొంతమైదానమైన ఉప్పల్లో ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడింటిలో టీమ్ ఓడిందంటేనే టీమ్మేనేజ్మెంట్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా టోర్నీ ఆసాంతం తుది జట్టులో మార్పులు చేయడం దెబ్బతీసింది. టీమ్ సెలెక్షన్తో పాటు కీలక నిర్ణయాల్లో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు స్వేచ్చ ఇవ్వలేదనే విషయం స్పష్టంగా అర్థమైంది.
చెత్త కోచింగ్..
సీజన్ మొత్తంలో సన్రైజర్స్ మేనేజ్మెంట్ ఏడు ఓపెనింగ్ జంటను మార్చింది. తొలి రెండు మ్యాచ్ల్లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయగా.. అనంతరం అన్మోల్ ప్రీత్ సింగ్కు అవకాశం ఇచ్చారు. అతను వన్డే తరహాలో బ్యాటింగ్ చేయడంతో బ్రూక్ను తీసుకొచ్చారు. అతను ఫ్లాట్ వికెట్పై ఒకే ఒక్క సెంచరీ చేయగా.. మిగతా మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
దాంతో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా బరిలోకి దించారు. అతను కూడా చేతులెత్తేయడంతో చివరి మ్యాచ్లో యువ ప్లేయర్ వివ్రాంత్ శర్మను ఆడించారు. మయాంక్ అగర్వాల్ను కూడా మిడిలార్డర్లో ఆడించి తర్వాత పక్కనపెట్టేసారు. మళ్లీ చివరి మ్యాచ్లో అవకాశం ఇచ్చారు.
టీమ్ను నడిపించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కోచ్ బ్రియాన్ లారా దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్ ట్రాక్స్పై పేసర్లను ఆడించి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన గ్లేన్ ఫిలిప్స్ను మరుసటి మ్యాచ్కే పక్కనపెట్టాడు. ఉమ్రాన్ మాలిక్కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. పదే పదే జట్టును మారుస్తూ ఆటగాళ్లలో గందరగోళం నెలకొనేలా చేశాడు.

చెత్త కెప్టెన్సీ..
కెప్టెన్గా మార్క్రమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఆటగాడిగా జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. కేవలం 235 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో టైటిల్ అందించిన మార్క్రమ్ ఆ మ్యాజిక్ను ఇక్కడ రిపీట్ చేయలేకపోయాడు. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్మెంట్స్లోనూ అతను తడబడ్డాడు. ప్రతీ మ్యాచ్లో చాలా ఒత్తిడికి గురయ్యాడు. కీలక నిర్ణయాలను పూర్తిగా బ్రియాన్ లారాకే వదిలేసాడు.
బౌలర్ల వైఫల్యం..
సన్రైజర్స్ హైదరాబాద్ అంటేనే బలమైన బౌలింగ్. బౌలింగ్ బలంతోనే ఆరెంజ్ ఆర్మీ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. గత సీజన్లోనూ బౌలింగ్తోనే కొన్ని అద్భుత విజయాలను అందుకుంది. కానీ ఈసారి సన్రైజర్స్ బౌలింగ్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. పేసర్లు, స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ పర్వాలేదనిపించినా అతనికి అండగా ఎవరూ రాణించలేదు.
స్పిన్లో మయాంక్ మార్కండే మినహా మరే స్పిన్నర్ వికెట్లు తీయలేదు. వాషింగ్టన్ సుందర్ 7 మ్యాచ్ల్లో మూడే వికెట్లు తీసి జట్టుకు దూరమయ్యాడు. బ్యాటింగ్ విభాగంలో హెన్రీచ్ క్లాసెన్ మినహా అంతా కట్టకట్టుకొని విఫలమయ్యారు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయలేక ఓటమిపాలయ్యారు. ఈ తప్పిదాలే సన్రైజర్స్ను పాయింట్స్ టేబుల్లో పాతాళానికి పరిమితం చేశాయి.