హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భజన ఎక్కువైంది. మైదానంలో సీఎస్కే ఆటగాళ్లు తుమ్మినా.. దగ్గినా క్రెడిట్ ధోనీకే ఇస్తున్నారు. సీఎస్కే అభిమానులే కాకుండా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ధోనీ జపం చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్లు అయితే ధోనీ పేరు లేకుండా వ్యాఖ్యానమే చేయడం లేదు.
కెరీర్ చివరి దశలో ఉండటం.. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారంలో ధోనీకి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు. కానీ సీఎస్కే టీమ్లో ఏ ఆటగాడు అద్భుతంగా రాణించినా ధోనీదే క్రెడిట్ అంటున్నారు. అయితే టీమ్ వైఫల్యాలను మాత్రం ఆటగాళ్లపై రుద్దుతున్నారు. విజయాల క్రెడిట్ ధోనీకి ఇచ్చినప్పుడు వైఫల్యాలను కూడా ధోనీకి ఆపాదించాలి? కదా అని సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే అనూహ్యంగా చెలరేగుతుండటాన్ని కూడా ధోనీ గొప్పతనంగా అభివర్ణిస్తున్నారు. అభిమానులు ఆ మాట అనడంలో తప్పులేదు. కానీ కామెంటేటర్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా రహానే బ్యాటింగ్ క్రెడిట్ ధోనీకి ఇవ్వడం ఏ మాత్రం భావ్యం కాదు. వాస్తవానికి రహానే.. దేశవాళీ క్రికెట్లోనే సత్తా చాటాడు. కానీ ఫ్రాంచైజీలు అతని వయసును దృష్టిలో ఉంచుకొని పట్టించకోలేదు.
సీఎస్కే కూడా రెండో రౌండ్ వేలంలో బ్యాకప్ ప్లేయర్గా పనికి వస్తాడని కనీస ధరకు తీసుకుంది. ఆరంభ మ్యాచ్ల్లోనూ అతనికి అవకాశం ఇవ్వలేదు. జట్టును గాయాల బెడద వేధిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రహానేను ఆడించాల్సి వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రహానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అదే జోరును కొనసాగిస్తున్నాడు.

రహానేకు అవకాశం ఇవ్వడం ధోనీ క్రెడిట్ అని అంతా మాట్లాడుతున్నారు. అయితే ఇదే ధోనీ టీమిండియా నుంచి రహానేను ఎందుకు తప్పించాడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఆటగాళ్ల క్రెడిట్ కొట్టేయడంలో ధోనీ ముందు వరుసలో ఉంటాడని సెహ్వాగ్ చెప్పకనే చెప్పాడు. యువ బౌలర్ల విషయంలోనూ క్రెడిట్ ధోనీకే ఇస్తున్నారు.
ఇక్కడ ఆటగాళ్ల క్రెడిట్ కొట్టేయాలని ధోనీకి లేకున్నా.. అతని అభిమానులు, అండగా ఉండే కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు పనిగట్టుకొని మరీ ధోనీ భజన చేస్తున్నారు. ఇదే కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు.
ధోనీ చివరి సీజన్ ఆడుతున్నాడనే ఉద్దేశంతోనే అతని బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ధోనీ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. కోల్కతా నైట్రైడర్స్తో విజయానంతరం మాట్లాడుతూ.. 'నా కోసమే ఇక్కడి అభిమానులు సీఎస్కే జెర్సీలు వేసుకున్నారు. నాకు ఘన వీడ్కోలు అందించాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. తదుపరి మ్యాచ్కు వీళ్లంతా కేకేఆర్ జెర్సీలో కనిపిస్తారు.'అని ధోనీ వాస్తవాన్ని వెల్లడించాడు.