హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. సక్సెస్ఫుల్గా 70 మ్యాచ్ల లీగ్ దశ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే క్వాలిఫయర్-1 మ్యాచ్తో ప్లే ఆఫ్స్ దశ ప్రారంభం కానుంది.
బుధవారం లక్నో-ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా.. శుక్రవారం క్వాలిఫయర్-2 జరగనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్తో ఈ ధనాధన్ లీగ్కు తెరపడనుంది. చెన్నై-గుజరాత్ మధ్య జరిగే క్వాలిఫయర్-1 కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.

ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అయితే.. ప్లేఆఫ్స్లోని మ్యాచ్లు వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏం చేస్తారనేది సగటు క్రికెట్ అభిమాని మనసులో మెదిలే ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే నిబంధనలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి.
నేడు చెన్నైలో జరిగే మ్యాచ్కు పెద్దగా వర్షం ముప్పు అయితే లేదు. 'ఆక్యూవెదర్' రిపోర్టు ప్రకారం.. కేవలం 2 శాతం మాత్రమే వర్షం పడేందుకు అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్ఆగిపోతే.. విజేతను సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు.
ఒకవేళ సూపర్ ఓవర్కు కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. లీగ్ స్టేజ్లో ఆయా జట్ల స్థానాలను బట్టి మ్యాచ్ ఫలితాన్ని తేలుస్తారు. ఈ నిబంధన క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వీటికి రిజర్వ్ డే లేదు.
ఈ నిబంధనలు బట్టి చూస్తే.. వర్షం కారణంగా క్వాలిఫయర్ 1 రద్దు అయితే.. అప్పుడు గుజరాత్ జట్టుకే ఫలితం అనుకూలంగా ఉంటుంది.
ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అత్యధిక విజయాలతో టాప్ 1లో ఆ జట్టు లీగ్ దశను ముగించింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్కు ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి.
క్వాలిఫయర్-2లో ఈ పరిస్థితి ఏర్పడితే క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు అవకాశం దక్కుతుంది. ఇక ఐపీఎల్ ఫైనల్కు రిజర్వ్డే ఉంది. రిజర్వ్డే కూడా మ్యాచ్ ఫలితం తేలకపోతే.. టైటిల్ను ఇరు జట్లు పంచుకుంటాయి.