న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. లోయరార్డర్లో బ్యాటింగ్ చేసి 5 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం ధోనీ ఒక్కడికే సాధ్యమన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో మూడు బంతుల్లో రెండు సిక్స్లు బాదిన ధోనీ.. ఐపీఎల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోనీ పెర్ఫామెన్స్పై అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ ఫీట్ ధోని ఒక్కడికే సాధ్యమన్నాడు.
'మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప ఆటగాడు. ఐపీఎల్లో అతను మిడిలార్డర్, లోయరార్డర్లో బ్యాటింగ్కు వచ్చి ఐదు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. మరే ప్లేయర్ కూడా అతనిలా లోయరార్డర్ వచ్చి ఈ ఫీట్ సాధించలేదు. ధోనీ మాత్రం నిలకడగా రాణిస్తూ.. పరుగులు చేస్తూ జట్టును గెలిపించాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఇక ధోనీ ఆడింది మూడు బంతులే అయినా.. తనదైన మార్క్ చూపించాడు. ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో జియో సినిమా వ్యూస్ సంఖ్య కోటీ 80 లక్షలకు చేరింది. ఈ మ్యాచ్ను సగటున కోటీ 50 లక్షల మంది చూడగా.. ధోనీ క్రీజులోకి రాగానే కోటీ 80 లక్షలకు పెరిగింది. రెండు వరుస సిక్స్లతో ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా ధోనీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ధోనీ ఇప్పటి వరకు 20వ ఓవర్లో 55 సిక్స్లు కొట్టగా.. కీరన్ పొలార్డ్ 33 సిక్స్లు బాదాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57), డెవాన్ కాన్వే(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 47) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చెన్నై 24 సార్లు 200 ప్లస్ స్కోర్ చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. కైల్ మేయర్స్(22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ(4/16) నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే రెండు వికెట్లు తీసాడు. మిచెల్ సాంట్నర్కు ఓ వికెట్ దక్కింది.