న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తీరును మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. టీమిండియాకు ఆడే సమయంలో అజింక్యా రహానేను ఎందుకు పక్కనపెట్టావని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రహానేకు ధోనీ అవకాశం కల్పించగా.. అతను 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
విధ్వంసకర బ్యాటింగ్తో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ వల్లే రహానే అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ధోనీ కూడా రహానే ఇన్నింగ్స్ క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశాడు. మ్యాచ్కు ముందు రహానేతో మాట్లాడానని చెప్పిన ధోనీ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడాలని సూచించానని, ఆటను ఆస్వాదించాలని కోరానని చెప్పాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రిక్ బజ్ చానెల్తో మాట్లాడుతూ..'ఐపీఎల్ జట్టులో అజింక్యా రహానేను ఆడించిన ధోనీ.. టీమిండియా నుంచి ఎందుకు తప్పించాడు. ప్లేయర్లకు టీమ్ మేనేజ్మెంట్ మద్దతు చాలా అవసరం. చెన్నై సూపర్ కింగ్స్లో ప్లేయర్లకు ధోనీ పూర్తి భరోసా ఇచ్చి ఫ్రీగా ఆడేలా ప్రోత్సహిస్తున్నానని చెబుతున్నాడు.
మరి అదే పని రహానే.. టీమిండియాలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు. ధోనీని నేను ఇదే అడగాలనుకుంటున్నా. భారత జట్టుకు ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు వన్డేల్లో నుంచి అజింక్యా రహానేను పక్కన పెట్టాడు. అతను స్లోగా ఆడుతున్నాడని, స్ట్రైక్ రొటేట్ చేయడం లేదని రహానేను జట్టు నుంచి తప్పించాడు.
ఐపీఎల్లో సీఎస్కే తరుపున ఆడేందుకు అడ్డురాని స్ట్రైక్ రేట్.. టీమిండియాలో ఆడేందుకు అడ్డు వచ్చిందా? ఇప్పుడు మోటివేట్ చేసినట్టే, అప్పుడు టీమిండియా తరుపున ఆడినప్పుడు మోటివేట్ చేసి ఉంటే... రహానే నుంచి ఇలాంటి ఇన్నింగ్స్లు వచ్చేవి కదా.'అని సెహ్వాగ్ నిలదీసాడు. వీరేంద్ర సెహ్వాగ్ను కూడా ధోనీనే జట్టు నుంచి తప్పించాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం లేదని కారణంతో అతన్ని పక్కన పెట్టేసాడు.