న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ను ఘోర పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపడుతుందని సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ అన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో చాలా లోపాలున్నాయని, ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా గొప్పేనని అభిప్రాయపడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.
ఈ ఓటమిపై ఓ చానెల్తో మాట్లాడిన టామ్ మూడీ.. ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ తరహా ప్రదర్శననే కొనసాగిస్తే ఈ సారి కూడా రోహిత్ సేన ఫైనల్ చేరదని జోస్యం చెప్పాడు. 'ముంబై జట్టు పేలవ ప్రదర్శన ఆందోళనకు గురి చేసే అంశం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా ముంబై ఇండియన్స్ గురించి ఇదే చెప్పాను.

జట్టులో చాలా లోపాలున్నాయి. ముంబై ఫైనల్ వరకు చేరుకుంటుందని నేను అనుకోవడం లేదు. ముంబై ఇండియన్స్ కాంబినేషన్లో సమతుల్యత లోపించింది. జట్టులో మెరుగ్గా బౌలింగ్ చేసే దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు కరవయ్యారు. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ వారికి కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు' అని టామ్ మూడీ చెప్పుకొచ్చాడు.
16 ఏళ్ల లీగ్ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 మెగా వేలం తర్వాత బలహీనంగా మారింది. కొత్తగా రెండు జట్లు రావడంతో ముంబై తయారు చేసుకున్న కోర్ టీమ్ అంతా చెల్లా చెదురైంది. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు పేలవ ఫామ్తో ఇబ్బంది పడటం కూడా ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. గత సీజన్లో వరుసగా 8 మ్యాచ్ల్లో ఓడిన ముంబై.. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అట్టడుగు స్థానంలో నిలిచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కూడా ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఇక ముంబై తన తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఈ నెల 8న సొంత మైదానం వాంఖడేలో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది.