హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్కు కలిసి రాలేదు. ఆటగాళ్లు మారినా.. కెప్టెన్ను మార్చినా.. కోట్ల రూపాయాలతో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా జట్టు ప్రదర్శన మాత్రం మారలేదు. గత రెండు సీజన్ల మాదిరే పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.
12 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్ల్లో గెలిచినా.. సన్రైజర్స్కు ఉపయోగం లేదు. వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా.. కోచ్, కెప్టెన్లను మార్చినా సన్రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ముఖ్యంగా మూడు కారణాలు ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాయి.
1. ఓవర్సీసీ బ్యాటర్ల వైఫల్యం: వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ మినహా జట్టులోని ఓవర్సీస్ ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ తన పేలవ ప్రదర్శనతో జట్టును నట్టేట ముంచేసాడు. కేకేఆర్పై సెంచరీ మినహా ప్రతీ మ్యాచ్లో అతను విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో 20.38 సగటుతో 163 పరుగులు మాత్రమే చేశాడు.

ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా పేలవ ప్రదర్శన కనబర్చాడు. 11 మ్యాచ్ల్లో 21.70 సగటుతో 217 పరుగులే చేశాడు. గ్లేన్ ఫిలిప్స్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. వీరి వైఫల్యం హెన్రీచ్ క్లాసెన్ ఆటను దెబ్బతీసింది. అతను ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి తోడు భారత స్టార్ బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వైఫల్యం సన్రైజర్స్ కొంపముంచింది.
2. పేలవ బౌలింగ్..: సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం బౌలింగ్. కానీ ఈ సీజన్లో బౌలింగ్ విభాగం చాలా ఆర్డినరీగా కనిపించింది. దాంతో సన్రైజర్స్ నుంచి ఏ ఒక్కరు కూడా పర్పుల్ క్యాప్ బోర్డ్లో చోటు దక్కించుకోలేకపోయారు. భువనేశ్వర్ ఒక్కడే కాస్తో కూస్తో వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చాడు. మార్కో జాన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ కూడా దారుణంగా విఫలమయ్యారు. మాయంక్ మార్కండే ఒక్కడే పర్వాలేదనపించాడు. 10 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీసాడు.

3. గెలిచే మ్యాచ్ల్లో ఓడటం..: సునాయసంగా గెలిచే మ్యాచ్ల్లో ఓడిపోవడం సన్రైజర్స్ హైదరాబాద్కు అలవాటు. ఈ సీజన్లోనూ ఆ సమస్య జట్టును వెంటాడింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్తో విజయం ముంగిట బోర్లా పడింది. లక్నోతో సొంతగడ్డపై చివరి 7 ఓవర్లలో 90 పరుగులిచ్చి చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది. అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇస్తూ మార్క్రమ్ చేసిన తప్పిదం జట్టు పతనాన్ని శాసించింది.

ఢిల్లీ క్యాపిటల్స్తో 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయింది. చేతిలో ఐదు వికెట్లు పెట్టుకొని చివరి 30 బంతుల్లో 38 పరుగులు చేయలేక ఓటమికి తల ఒంచింది. ఈ మూడు మ్యాచ్లు గెలిచి ఉంటే సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేది.