
హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ భాగం కానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021లో చివరిసారిగా ఆడిన స్మిత్.. తర్వాతి రెండు సీజన్ల కోసం జరిగిన వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. వేలం ముగిసిన తర్వాత అతను పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్లో సెంచరీల మోత మోగించాడు. భారత్తో టెస్ట్, వన్డే సిరీస్లో విఫలమైన కెప్టెన్గా ఆకట్టుకున్నాడు.
తాజాగా ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసిన స్మిత్.. తాను ఐపీఎల్ 2023లో భాగమవుతున్నానని తెలిపాడు. 'నమస్తే ఇండియా. నేను మీతో అద్భుతమైన వార్తను పంచుకోబోతున్నాను. నేను ఐపీఎల్ 2023 బరిలోకి దిగబోతున్నాను. అవును నిజంగా.. నేను ఓ అసాధారణమైన జట్టులో భాగమవుతున్నాను'అని తెలిపాడు. స్మిత్ వీడియోతో అతను ఏ ఆటగాడి ప్లేస్ను అయినా భర్తీ చేస్తున్నాడా? లేక కామెంటేటర్గా వ్యవహరిస్తాడా? అనే సందేహాలు నెలకొన్నాయి.
స్మిత్ మాటలను బట్టి చూస్తే అతను కామెంట్రీ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అతను జియో సినిమా ఓటీటీకి కామెంట్రీ చెబుతాడా? లేక స్టార్ స్పోర్ట్స్ చానెల్ కామెంటేటర్గా వ్యవహరిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్లో స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
మొత్తం 103 ఐపీఎల్ మ్యాచ్ల్లో 128.09 స్ట్రైక్రేట్తో 2485 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది. చివరి సారిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2021లో ఆడిన స్మిత్.. 8 మ్యాచ్ల్లో 152 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు సీజన్ల వేలంలో అతను రూ.2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగగా.. ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.