హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ను అధికారిక టీవీ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పండుగ చేసుకుంటోంది. రికార్డు స్థాయి వ్యూయర్షిప్స్తో కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. టీమిండియా క్రికెట్ మ్యాచ్లకు కూడా స్టార్ స్పోర్ట్సే అధికారిక బ్రాడ్ కాస్టర్గా ఉండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు అంచనాలకు తగ్గట్లు రేటింగ్స్ అందుకోలేకపోయింది. ఫలితంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ ఈ మూడు నెలల లెక్కలను ఒక్క ఐపీఎల్ సీజన్తో భర్తీ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ సిద్దమైంది.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినట్లు ఎక్స్చేంచ్4మీడియా అనే సంస్థ పేర్కొంది. మీడియా, చానెళ్లకు సంబంధించిన వ్యూయర్షిప్ వివరాలను ఈ సంస్థ వెల్లడిస్తూ ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 29 శాతం పెరిగిందని ఈ వెబ్సైట్ పేర్కొంది.

ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్లో 14 కోట్ల మంది వీక్షించారని, ఇది 47 శాతం ఎక్కువని తెలిపింది. ఇక ఓటీటీ రైట్స్ అందుకున్న జియో సినిమా యాప్ సైతం రికార్డు సృష్టించిందని, తొలి మ్యాచ్ను ఈ యాప్ వేదికగా 6 కోట్ల మంది వీక్షించారని పేర్కొంది. ఒక రోజు అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్గా కూడా జియో సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు వెల్లడించింది.
తొలి మ్యాచ్ తర్వాత ఆదివారం జరిగిన ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ మ్యాచ్కు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా పెట్టిన ఖర్చుకు రెండింతలు లాభాలు ఆర్జిస్తున్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే జియో సినిమా యాప్ సేవలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాప్లో సాంకేతిక లోపాలున్నాయని, బఫరింగ్ సమస్య ఉందని ఫిర్యాదు చేస్తున్నారు. కామెంట్రీ కూడా చాలా నాసిరకంగా ఉందని, స్టార్ స్పోర్ట్సే చాలా క్వాలిటీ కంటెంట్ ఇస్తుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ కారణాలతోనే చాలా మంది యూజర్లు ఐపీఎల్ మ్యాచ్లను టీవీల్లోనే చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. టీవీలు అందుబాటులో లేని వారు మాత్రమే తప్పని పరిస్థితుల్లో జియో సినిమా యాప్లో మ్యాచ్లను వీక్షిస్తున్నారని ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు ప్రసార హక్కులను నాలుగు విభాగాలుగా విభజించగా.. బీసీసీఐ ఖజానాలోకి రూ.48,390.52 కోట్ల భారీ మొత్తం చేరింది.
టీవీ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకి రూ.23,575 కోట్లు చెల్లించేందుకు స్టార్ నెట్వర్క్ సిద్ధమవ్వగా.. డిజిటల్ రైట్స్ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లు చెల్లించనుంది.