నాలుగేళ్ల తర్వాత ఉప్పల్లో మ్యాచ్..
కరోనా కారణంగా గత మూడేళ్లు.. పరిమిత వేదికల్లోనే బయో బబుల్లో ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు పడటంతో పాత పద్దతిని అనుసరించనున్నారు. దాంతో హైదరాబాద్ వేదికగా మళ్లీ ఐపీఎల్ సందడి మొదలు కానుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్లు ఆడనుంది. 2019లో చివరిసారిగా ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరగ్గా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
రాజస్థాన్తో తొలి పేరు..
గ్రూప్-బిలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. తమ గ్రూప్లోనే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్లతో రెండేసి మ్యాచ్లు ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న రాజస్థాన్ రాయల్స్తో రెండు మ్యాచ్లు, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 02న రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఐపీఎల్ 2023 క్యాంపైన్ను ప్రారంభించనుంది.
జ్యూస్ పిండేస్తామని వార్నింగ్..
రాజస్థాన్ రాయల్స్కు 44 రోజుల ముందే సన్రైజర్స్ హెచ్చరించింది. ట్విటర్ వేదికగా ఆ జట్టును గెలికి మరీ కయ్యానికి కాలు దువ్వింది. పింక్ కలర్ జ్యూస్ గ్లాస్ను షేర్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. తొలి మ్యాచ్లో మీ పరిస్థితి ఇదేనంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ ట్వీట్కు రాజస్థాన్ రాయల్స్ సైతం అదరిపోయే రిప్లే ఇచ్చింది. గతేడాది పిండింది సరిపోలేదా? అంటూ గత మ్యాచ్ స్కోర్ కార్డ్ను షేర్ చేసింది. ఆ మ్యాచ్లో సన్రైజర్స్ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్కు ముందు ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ను ట్వీట్ చేసిన రాజస్థాన్.. మ్యాచ్ అనంతరం ఖాళీ గ్లాస్ను షేర్ చేస్తూ.. ఆరెంజ్ ఆర్మీ జ్యూస్ను పిండేసామని పేర్కొంది.
అప్పుడు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క..
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సైతం ఆరెంజ్ ఆర్మీకి అండగా నిలుస్తూ రాజస్థాన్కు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు ఓ లెక్క ఇప్పుడో లెక్కని, సొంత మైదానంలో రాజస్థాన్కు దబిడి దిబిడేనని కామెంట్ చేస్తున్నారు. అప్పుడు కెప్టెన్ వేరని, ఇప్పుడున్న ఆటగాళ్లు వేరని, సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచి జట్టు ఉత్సాహంగా ఉందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా కావ్యపాప తగ్గేదేలే అన్నట్లు దూకుడు నిర్ణయాలు తీసుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
