
హైదరాబాద్: 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది' సన్రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) పరిస్థితి. చెన్నై సూపర్ కింగ్స్ సారథి, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. తమ హోమ్ గ్రౌండ్ అయిన చెన్నైలో చెపాక్ స్టేడియంలో కుర్చీలకు ఎల్లో పెయింట్ వేసాడు.
పెయింట్ స్ప్రే సాయంతో బ్లూ కలర్లో ఉన్న కుర్చీలను పూర్తిగా పసుపుమయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'ఇది కచ్చితంగా ఎల్లోవే.. ఏప్రిల్ మూడు కోసం వెయిట్ చేస్తున్నాం' అని ట్వీట్ చేసింది. ఏప్రిల్ 3న చెన్నైలో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఈ మ్యాచ్ కోసమే స్టేడియాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ ముస్తాబు చేస్తుండగా.. ధోనీ కూడా సీట్లకు పెయింట్ చేసి.. తనకు ఇచ్చిన స్ప్రే పెయింట్ డబ్బా పని చేస్తోందని చెప్పడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోనీ అని, కోట్లు సంపాదించినా.. ఓ జట్టు కెప్టెన్ అయినా.. సాధారణ వ్యక్తిలా పెయింట్ వేయడం గొప్ప విషయమని ధోనీని నెటిజన్లు ప్రశంసించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ధోనీ చేసిన పనితో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తమ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ముందు వింత డిమాండ్ ఉంచారు.
సన్రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో కుర్చీలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. జట్టు జెర్సీ కలర్ ఆరెంజ్ కలర్ వేయకపోయినా.. కుర్చీలపై ఉన్న కాకీరెట్టలను కడగాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ను ట్రోల్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో పాటు అంతర్గత రాజకీయాలతో విభేదాల్లో కూరుకుపోయిన హెచ్సీఏ స్టేడియం నిర్వహణపై చేతులెత్తేసింది.
గతేడాది సెప్టెంబర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టీ20కి ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇవ్వగా.. టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. సరైన నిర్వహణ లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో మైదానంలోని కుర్చీలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ కాకిరెట్టలున్న కుర్చీల కోసం అభిమానులు ఎగబడుతున్నారా? అనే సెటైర్లు వినిపించాయి.
తాజాగా ధోనీ తమ మైదానంలోని కుర్చీలకు పెయింట్ వేయడంతో.. మార్క్రమ్ కాకిరెట్టలను క్లీన్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. శుక్రవారం(మార్చి 31న) జరగనున్న ఈ సీజన్ ఓపెనర్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్(02)న రాజస్థాన్ రాయల్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది.