
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్లో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా రాణిస్తే.. మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం పృథ్వీ షా చాలా ఫిట్గా ఉన్నాడని, టెక్నిక్ పరంగా కూడా బలంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చెలరేగితే టీమిండియాలో చోటు దక్కించుకుంటాడని దాదా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ హెడ్గా మీడియాతో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. పృథ్వీ షాను కొనియాడాడు.
'టీమిండియా తరఫున ఆడేందుకు పృథ్వీ షా రెడీగా ఉన్నాడు. అవకాశాలు వస్తే మాత్రం అతను తప్పకుండా నిరూపించుకుంటాడు. కానీ, టీమిండియాలో అతను ఆడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2023 నేపథ్యంలో పృథ్వీ షాపై కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్టర్లు దృష్టి పెడతారని అనుకుంటున్నా. పృథ్వీ షా చాలా నాణ్యమైన ఆటగాడు'అని సౌరవ్ గంగూలీ తెలిపాడు.
గతంతో పోలిస్తే పృథ్వీ షా మరింత ఫిట్గా మారాడని, తప్పకుండా ఈసారి ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. గతంతో పోలిస్తే షాలో చాలా మార్పు వచ్చిందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతనేనని, ఆరెంజ్ క్యాప్ కూడా అందుకుంటాడని పాంటింగ్ జోస్యం చెప్పాడు.
ఇక ఓపెనర్గా రాణించే పృథ్వీ షాకు భారత జట్టులో స్థానంపై సందిగ్ధత నెలకొంది. వన్డేల్లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు బరిలోకి దిగేందుకు శుభ్మన్ గిల్, సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ తదితరులు పోటీ పడుతున్న నేపథ్యంలో పృథ్వీ షాకు చోటు కష్టమవుతోంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పృథ్వీ షా ఇప్పటి వరకు 68 మ్యాచుల్లో 1,588 పరుగులు చేశాడు. ఇటీవల సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న పృథ్వీ షా .. వాటన్నింటిని పక్కన పెట్టేసి ఐపీఎల్ 2023 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయడంపై ఫోకస్ పెట్టాడు. రెండేళ్ల క్రితం భారత్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. దాంతో సెలెక్టర్లపై బాహటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు పృథ్వీ షా ఎంపికైన తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాణిస్తే పృథ్వీషాకు అవకాశం దక్కుతుందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.