న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ (58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్లో రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్కు ఇది ఫస్ట్ సెంచరీ కావడం విశేషం.
గుజరాత్కు ఇదివరకు 13 మ్యాచ్లు ఆడిన గిల్.. వెయ్యి పరుగులు కూడా పూర్తి చేశాడు. 29 ఇన్నింగ్స్ల్లో గిల్.. 1,059 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని సగటు 40.73 గా ఉండగా స్ట్రైక్ రేట్ 139.53గా ఉంది. ఇందులో 8 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది.

కాగా హైదరాబాద్ తో సెంచరీ చేయడంతో గిల్.. టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో శతకం బాది ఈ లీగ్ లో కూడా మూడంకెల స్కోరు చేసిన ఆరో బ్యాటర్గా నిలిచాడు.
భారత్ తరఫున రోహిత్ శర్మ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడాలు అంతర్జాతీయ స్థాయిలో టీ20 సెంచరీలు చేశారు. వీరిలో దీపక్ హుడా మినహా మిగిలినవారంతా ఇంటర్నేషనల్ టీ20లతో పాటు ఐపీఎల్ లో కూడా శతకాలు బాదారు.
తాజా సెంచరీతో గిల్.. ఒకే క్యాలెండర్ ఈయర్ లో వన్డేలు, టెస్టులు, టీ20లతో పాటు ఐపీఎల్ లో కూడా సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శుభ్మన్ గిల్.. శ్రీలంక, న్యూజిలాండ్ పై వన్డేలు, టీ20ల్లో సెంచరీలు చేయగా ఆస్ట్రేలియాతో టెస్టులో కూడా శతకం సాధించాడు.
శుభ్మన్ గిల్ శతకంతో ఈ మ్యాచ్లో గుజరాత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్మన్కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. హెన్రిచ్ క్లాసెన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. భువనేశ్వర్ కుమార్(26 బంతుల్లో 3 ఫోర్లతో 27) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్కు ఓ వికెట్ దక్కింది.