బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పోరాటం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన డూఆర్డై మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ ఇంటిదారి పట్టగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ( 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్తో 101 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. అనూజ్ రావత్(15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, యశ్ దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 104 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. విజయ్ శంకర్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. విజయ్ కుమార్ వైశాఖ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా(12)ను మహమ్మద్ సిరాజ్ మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన విజయ్ శంకర్తో కలిసి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ కొద్ది సేపటికే 34 బంతుల్లో విజయ్ శంకర్ అర్థ శతకాన్ని అందుకున్నాడు. ఈ జోడీ సూపర్ బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోవడంతో గుజరాత్ విజయం లాంఛనమని అంతా అనుకున్నారు.
కానీ విజయ్ కుమార్ వైశాఖ్ సూపర్ బౌలింగ్తో విజయ్ శంకర్ను ఔట్ చేసి రెండో వికెట్కు నమోదైన 123 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే డసన్ షనకను హర్షల్ పటేల్ డకౌట్గా పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి 18 బంతుల్లో 34 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ వేసిన 18వ ఓవర్లో శుభ్మన్ గిల్ సిక్స్ బాదగా.. డేవిడ్ మిల్లర్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ తెవాటియాను ప్రమోట్ చేసి పంపించగా.. శుభ్మన్ గిల్ సిక్స్ బాదడంతో గుజరాత్ విజయానికి 12 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో శుభ్మన్ గిల్ సిక్స్ బాదడంతో చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. వ్యాన్ పార్నెల్ నోబాల్తో చివరి ఓవర్ను ప్రారంభించగా.. శుభ్మన్ గిల్ సిక్స్తో సెంచరీ సాధించడంతో మ్యాచ్ను ముగించాడు.