హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండ్ బెన్ట్ స్టోక్స్ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆ జట్టు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఆటగాడు ఇతడే. అయితే టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంత భారీ మొత్తం ఖర్చు చేసిందనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు సారథిగా ఉన్న బెన్ స్టోక్స్.. భవిష్యత్తులో చెన్నై పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అప్కమింగ్ సీజన్లోనే ధోనీ నుంచి స్టోక్స్.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవచ్చని అంచనా వేశాడు.'బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అవుతాడని అనిపిస్తోంది. గత సీజన్లో ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను మరొకరికి అప్పగించాడు. ఐపీఎల్ సీజన్ల మధ్యలో ధోనీ పెద్దగా మ్యాచ్లు ఆడట్లేదు. రాబోయే సీజన్లోనూ కెప్టెన్సీని అప్పగించేందుకు ధోనీకి స్టోక్స్ రూపంలో అవకాశం వచ్చింది. అదే జరిగితే స్టోక్స్ తదుపరి కెప్టెన్ అవుతాడు'అని ఓ మీడియా చానల్తో మాట్లాడుతూ స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
గత సీజన్కు ముందు ధోనీ.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై పగ్గాలను భారత ఆల్రౌండర్ జడేజాకు అప్పగించారు. కానీ, జడేజా సారథ్యంలో చెన్నై జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో సీజన్ మధ్యలో అతడిని తప్పించి.. తిరిగి ధోనీనే కెప్టెన్ చేశారు.
ఇక.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ ఛాంపియన్గా నిలవడంతో.. ఐపీఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్కరన్ ఏకంగా రూ.18.5 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. స్టోక్స్ కూడా రూ.16.25కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ విజయంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.