
గువహతి: దేవదత్ పడిక్కల్ను మిడిలార్డర్లో ఆడిస్తూ తాము చేసిన ప్రయోగం బెడిసికొట్టిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. దేవదత్ పడిక్కల్ వైఫల్యంతో పాటు పవర్ ప్లేలో ధారళంగా పరుగులివ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలడనే పడిక్కల్ను మిడిలార్డర్లో ఆడించామని, కానీ అతను తమ అంచనాలను అందుకోలేకపోయాడని తెలిపాడు. 'నిజాయితీగా చెబుతున్నా ఈ వికెట్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది. కొత్త బంతితో ఏ మాత్రం మూవ్మెంట్ లభించలేదు. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా పవర్ ప్లేను చక్కగా వాడుకుంది.
మా బౌలర్లు వేరియేషన్స్తో బౌలింగ్ చేసి భారీ స్కోర్కు అడ్డుకట్ట వేసారు. 197 పరుగులకు కట్టడి చేయడం గొప్ప అనుకున్నా. క్యాచ్ అందుకునే క్రమంలో జోస్ బట్లర్ వేలికి గాయమైంది. దాంతోనే అతను ఓపెనర్గా బరిలోకి దిగలేదు. మిడిల్ ఓవర్లలో పంజాబ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడుతాడని పడిక్కల్ను మిడిలార్డర్లో బ్యాటింగ్ పంపించాం. కానీ అతను మా అంచనాలను అందుకోలేకపోయాడు.
ధృవ్ జురేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కోచ్లు అతని గురించి చాలా వర్క్ చేశారు. ఐపీఎల్కు ముందు ఒక వారం క్యాంప్ ఏర్పాటు చేశాం. కానీ కోచ్లు ఆఫ్ సీజన్లో కూడా అకాడమీల్లో యువ ఆటగాళ్లను తీర్చి దిద్దారు. వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుందని అంచనా వేసాను. కానీ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే డ్యూ ఉంది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి మ్యాచ్కు సిద్దమవ్వాల్సిన అవసరం ఉంది.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.