హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 2 బంతులకు 10 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా(15 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
మరోవైపు టోర్నీ ఆసాంతం అద్బుత ప్రదర్శన కనబర్చి టేబుల్ టాపర్గా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తృటిలో టైటిల్ను కోల్పోయింది. జేతగా చెన్నై నిలిచినప్పటికీ.. ఈ సీజన్లో ఎక్కువ అవార్డులు మాత్రం గుజరాత్కే దక్కాయి. అత్యధిక పరుగుల వీరుడిగా శుభ్మన్ గిల్(890) ఆరెంజ్ క్యాప్ అందుకోగా.. అత్యధిక వికెట్లతో మహమ్మద్ షమీ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

అయితే 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాళ్లు ఛాంపియన్గా నిలిచారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ, తాజా శుభ్మన్ గిల్ వరకు ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాళ్లు టైటిళ్లు అందుకోలేకపోయారు. 2014లో కేకేఆర్ తరఫున రాబిన్ ఊతప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా టైటిల్ అందుకోగా.. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ ఛాంపియన్గా నిలిచాడు.
ఏడుగురు ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ ఫైనల్లో ఓడిపోయారు. 2010లో సచిన్ టెండూల్కర్(618), 2011లో క్రిస్ గేల్(608), 2013లో మెక్ హస్సీ(733), 2016లో విరాట్ కోహ్లీ(973), 2018లో కేన్ విలియమ్సన్(735), 2022లో జోస్ బట్లర్(863), తాజా సీజన్లో గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఫైనల్లో ఓడి టైటిల్ను అందుకోలేకపోయారు.