హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పేలవ ప్రదర్శన కనబర్చింది. మరోసారి టైటిల్ గెలవకుండానే అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగినా ఆర్సీబీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది.
14 మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్లపైనే ఆధారపడింది. బ్యాటింగ్ భారాన్ని మోత్తం కేజీఎఫ్ మోయగా.. బౌలింగ్లో సిరాజ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. దాంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ ఓటమిపాలైంది.

స్టార్ ఆటగాళ్ల గాయాల బెడదతో పాటు దినేశ్ కార్తీక్ వంటి సీనియర్ ఆటగాళ్ల పేలవ ఫామ్ ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ టీమ్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న మినీ వేలానికి ముందు వదులుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకుంటోంది.
ముఖ్యంగా పేలవ ప్రదర్శన కనబర్చిన ముగ్గురు వీదేశీ ఆటగాళ్లను వదులుకునేందుకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుం వీరిని రిలీజ్ లిస్ట్లో చేర్చి డిసెంబర్ వరకు వారి ఆటతో పాటు ఫిట్నెస్ను నిశితంగా పరిశీలించనుంది.
1. వానిందు హసరంగా : ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో రూ.10.75 కోట్ల భారీ దరకు వానిందు హసరంగాను ఆర్సీబీ కొనుగోలు చేసింది. హసరంగా బ్యాటింగ్ కూడా చేయగలడనే విశ్వాసంతో జట్టులో ప్రధానమైన యుజ్వేంద్ర చాహల్ను కూడా వదులుకుంది. ఆర్సీబీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ సీజన్లో హసరంగా 22 వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్లో మాత్రం విఫలమయ్యాడు.
అదే నమ్మకంతో ఐపీఎల్ 2023 సీజన్లో కొనసాగించగా అతను దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్ల్లో కేవలం 9 వికెట్లు మాత్రమే తీసాడు. ఓవర్కు 9 పరుగుల చొప్పున పరుగులు సమర్ఫించుకున్నాడు. హసరంగా వైఫల్యం ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే హసరంగాను వదులుకొని భారత యువ స్పిన్నర్ను తెచ్చుకోవాలని ఆర్సీబీ, తద్వారా ఓవర్సీస్ స్లాట్ ఖాళీ అవుతుందని భావిస్తోంది. భారత యువ స్పిన్నర్ను తీసుకుంటే హసరంగా స్థానంలో మైఖేల్ బ్రేస్వెల్ను ఆడించవచ్చని ప్లాన్ చేస్తోంది.
2. జోష్ హజెల్ వుడ్ : ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆర్సీబీకీ ఆడుతున్న హజెల్ వుడ్.. గతేడాది 20 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ ఏడాది గాయం కారణంగా అతను మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ మూడు మ్యాచ్ల్లోనూ మూడు వికెట్ల తీసాడు. జోష్ హజెల్ వుడ్ ఫిట్నెస్ వ్యవహారం ఆర్సీబీకి ఇబ్బందిగా మారింది. గతేడాదిగా అతను తరుచూ గాయపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునేందుకుఆర్సీబీ సిద్దమవుతోంది.
3. ఫిన్ అలెన్ : ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.80 లక్షల కనీస ధరకు ఫిన్ అలెన్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్వెల్, వానిందు హసరంగా, జోష్ హజెల్ వుడ్తో ఓవర్సీస్ కోటా పూర్తవ్వడంతో ఫిన్ అలెన్కు అవకాశం రావడం లేదు. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునేందుకు ఆర్సీబీ సిద్దమవుతోంది.