
బెంగళూరు: చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తోనే ఐపీఎల్ 2023 సీజన్లో శుభారంభం చేయలేకపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
గత 11 సీజన్లుగా తమ చెత్త రికార్డును కొనసాగిస్తోంది. 2013 నుంచి తాజా సీజన్ వరకు ముంబై శుభారంభం అందుకోలేదు. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. అసాధారణ బ్యాటింగ్తో రాణించిన యువ ప్లేయర్ తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు.
అద్భుతమైన బ్యాటింగ్తో పోరాడే లక్ష్యాన్ని అందించాడని కొనియాడిన రోహిత్.. బౌలింగ్లో మాత్రం ప్రణాళికలకు తగ్గట్లు రాణించలేకపోయామని తెలిపాడు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని, అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
'బ్యాట్తో మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయాం. ముఖ్యంగా తొలి 6 ఓవర్లలో దారుణంగా విఫలమయ్యాం. అయినా తిలక్ వర్మ అసాధారణ పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఇతర బ్యాటర్లతో పోరాడే లక్ష్యాన్ని అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయాం. బంతితో ప్రణాళికలకు తగ్గట్లు రాణించలేకపోయాం.
ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. తిలక్ వర్మ సానుకూల దృక్పథం ఆడే ఆటగాడు. అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. అతను ఆడిన కొన్ని షాట్లు ఆకట్టుకున్నాయి. పోరాడే లక్ష్యాన్ని అందించిన తిలక్ వర్మకు హ్యాట్సాఫ్.
మా జట్టు శక్తి సామర్థ్యాల్లో సగం ఆడకపోయినా 170 పరుగులు చేయగలిగాం. 30-40 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది. గత 6-8 నెలలు నేను జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడుతున్నాను. అఫ్కోర్స్ ఇది విభిన్నమైన సెట్ అయినా.. జట్టులో బుమ్రా లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
ఇతర ఆటగాళ్లు అతను లేని లోటును పూడ్చడం లేదు. ఆటగాళ్ల గాయాలనేది మన చేతుల్లో లేని పని. ఏం చేయలేని పరస్థితి. జట్టులోని ఇతర ఆటగాళ్లు ప్రతిభ కలిగిన వారే. వారికి మేం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. మా తప్పిదాలను సమీక్షించుకొని తదుపరి మ్యాచ్లో సత్తా చాటుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ( 46 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో రాణించగా.. నెహాల్ వాదెర(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 21) అండగా నిలిచాడు.
ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లీ, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, మైఖేల్ బ్రేస్వెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 172 పరుగులు చేసి 22 బంతులుండగానే సునాయస విజయాన్నందుకుంది.
విరాట్ కోహ్లీ( 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 82 నాటౌట్ ), ఫాఫ్ డుప్లెసిస్(43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 73) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీసారు.