న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ ఫినిషరని రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ విషయంలో ధోనీకి సాటిలేరని చెప్పాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం సిద్దమవుతున్న రియాన్ పరాగ్.. టీమ్మేనేజ్మెంట్ కోరిన విధంగా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. జట్టులో ఫినిషర్ పాత్ర పోషించడం తనకు ఇష్టమని తెలిపిన రియాన్ పరాగ్.. అవకాశం వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుందని తెలిపాడు.
'రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నన్ను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా చేసేందుకు నేను రెడీ. నాకే ఆప్షన్ ఇస్తే మాత్రం సెకండ్ డౌన్లో ఆడేందుకు ఆసక్తి చూపుతా. జట్టు అవసరాలకు తగ్గట్లుగా నేను ఎక్కడ ఫిట్ అవుతాననేది టీమ్మేనేజ్మెంట్కు బాగా తెలుసు. కేవలం ఒకరిద్దరు ఆడితే మ్యాచ్ గెలవలేం. టీమ్ అంతా కలిసి కట్టుగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. గత మూడేళ్లుగా ఫినిషర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. అయితే, అత్యుత్తమ ఫినిషర్ అని అంటే మాత్రం నాకు మొదట గుర్తుకొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. అతని స్థానంలో మరొక ఆటగాడిని నేను అస్సలు ఊహించలేను. ధోనీ మ్యాచ్ను ఎలా అంత అద్భుతంగా ముగిస్తాడనేదానిని నిరంతరం గమనిస్తూనే ఉంటాను. అతనిలా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాను'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రియాన్ పరాగ్.. ఈసారి మాత్రం అత్యుత్త ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో రాణించడం వల్లే ఇంత నమ్మకంగా ఉన్నట్లు తెలిపాడు. 'ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చా. అందుకే, ఐపీఎల్లో రాణించగలనని ధీమాతో ఉన్నా. ఇప్పటికే జైపుర్లో మా కోసం కొన్ని ప్రాక్టీస్ క్యాంప్లు కూడా జరిగాయి. ప్రతి ఒక్కరూ బ్యాటింగ్, బౌలింగ్లో మంచి టచ్లోనే ఉన్నారు. నాలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సన్న గిల్లలేదు. బౌలింగ్నూ మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా శ్రమించా. దేశవాళీ క్రికెట్ సీజన్లో ఈసారి దాదాపు 350 ఓవర్లపాటు బౌలింగ్ చేశా. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్లోనూ నా సత్తా చాటుతా'' అని పరాగ్ చెప్పాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 2వ తేదీ సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.