
హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ విధించిన గడువు ముగియడంతో ఫ్రాంచైజీలు అంటిపెట్టుకున్న ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసిన ప్లేయర్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీ సైతం తాము వదిలేసుకున్న ప్లేయర్లతో పాటు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే ఆర్సీబీ అన్ని ఫ్రాంచైజీల్లా పెద్ద మార్పులు ఏం చేయలేదు. తమ కోర్ టీమ్పై పూర్తి నమ్మకం ఉంచిన ఆర్సీబీ.. ఎక్స్ట్రా ప్లేయర్లను మాత్రమే వదిలేసింది.
గతేడాది ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న జాసన్ బెహ్రెండార్ఫ్ను మళ్లీ ఆ జట్టుకే ఇచ్చేసింది. జాసన్ బెహ్రండార్ఫ్తో పాటు విండీస్ ప్లేయర్ షెర్ఫానే రుదర్ ఫోర్డ్ను వదిలేసింది. హైదరాబాద్ క్రికెటర్ చామ మిలింద్తో పాటు ఇతర దేశవాళీ క్రికెటర్లు అనీశ్వర్ గౌతమ్, లువ్నిత్ సిసోడియాలను రిలీజ్ చేసింది. హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనందర్ కుమారుడే చామ మిలింద్. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ అతన్ని రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్సీబీ దగ్గర రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలాయి. ఈ డబ్బులతో ఆ జట్టు ఒక స్టార్ ప్లేయర్ను మాత్రమే కొనగలదు. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, సామ్ కరన్ల కోసం ఆ జట్టు పోటీ పడే అవకాశాలున్నాయి.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, నయా హిట్టర్ దినేశ్ కార్తీక్, విధ్వంసకర ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్లను జట్టు అంటిపెట్టుకుంది. డేవిడ్ విల్లేను వదిలేస్తారని ప్రచారం జరిగినా.. అతనిపై ఫ్రాంచైజీ మరోసారి నమ్మకం ఉంచింది.
ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లేన్ మ్యాక్స్వెల్, వానిందు హసరంగా, షెహ్బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, కరన్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్
ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..
జాసన్ బెహ్రెన్డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామ మిలింద్, లువినిత్ సిసోడియా, షెఫ్రానే రూదర్ఫోర్డ్