
హైదరాబాద్: అందరూ ఊహించనట్లుగానే న్యూజిలాండ్ విధ్వంసకర ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ గాయంతో దూరమవ్వగా అతని స్థానాన్ని బ్రేస్వెల్తో భర్తీ చేసింది. ఇక బంగ్లాదేశ్ పర్యటనలో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ విల్ జాక్స్ గాయపడ్డాడు. దాంతో అతను హుటాహుటినా ఇంగ్లండ్ బయల్దేరాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు.
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో విల్ జాక్స్ను ఆర్సీబీ రూ.3.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్లో మిడిలార్డర్ను బలోపేతం చేయడానికి ప్లాన్ చేసి మరి విల్ జాక్స్ను తీసుకుంది. సౌతాఫ్రికా వేదికగా జరిగిన టీ20 లీగ్లోనూ విల్ జాక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో ఐపీఎల్ 2023 సీజన్లోనూ అతను చెలరేగుతాడని ఆర్సీబీ ఫ్యాన్స్ భావించారు. కానీ దురదృష్టవశాత్తు అతను గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
విల్ జాక్స్ దూరమైన నేపథ్యంలో ఆర్సీబీ.. జట్టులో కీలక మార్పు చేసింది. మైఖేల్ బ్రేస్వెల్ను అతని బేస్ ప్రైజ్ కోటి రూపాయలకు జట్టులోకి తీసుకుంది. భారత్ వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్లో బ్రేస్వెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేల్లో లోయరార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన బ్రేస్వెల్ (78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్లతో 140) పరుగులతో భారత్ను ఓడించినంత పనిచేశాడు.
అంతేకాకుండా కెరీర్ ఫస్ట్ టీ20.. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్ తీసిన బౌలర్ కూడా బ్రేస్వెల్ కావడం విశేషం. ఐర్లాండ్తో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్లో బ్రేస్వెల్ ఈ ఘనతను అందుకున్నాడు. లెఫ్టార్మ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేయడం బ్రేస్ వెల్ స్పెషాలిటీ. అయితే తుది జట్టులో బ్రెస్వెల్కు అవకాశం దక్కుతుందా? లేదా అనేది చూడాలి. వానిందు హసరంగా స్థానంలో బ్రెస్వెల్కు అవకాశం దక్కవచ్చు. ఒకవేళ మ్యాక్స్వెల్ అన్ఫిట్గా ఉన్నా.. బ్రేస్వెల్కు చాన్స్ దక్కుతుంది.