అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రవీంద్ర జడేజా(6 బంతుల్లో 15 నాటౌట్) సూపర్బ్ బ్యాటింగ్తో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 2 బంతుల్లో చెన్నై విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. జడేజా 6, 4 బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. డెవాన్ కాన్వే(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47), శివమ్ దూబే(21 బంతుల్లో 2 సిక్స్లతో 32), అంబటి రాయుడు(8 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో 19), అజింక్యా రహానే(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
భారీ లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు వర్షం ఊహించని షాకిచ్చింది. మూడు బంతులు ఆడగానే భారీ వర్షం పడటంతో అంపైర్లు ఆటను ఆపేసారు. ఆ తర్వాత వర్షం ఆగినా మైదానం చిత్తడిగా మారడంతో గేమ్ రీస్టార్ట్ కావడానికి టైమ్ పట్టింది. చివరకు ఓవర్లతో పాటు లక్ష్యాన్ని కుదించి ఆటను ప్రారంభించారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదరిపోయే ఆరంభాన్ని అందించారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు బాదిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో 6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నూర్ అహ్మద్ విడదీసాడు.
ఏడో ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. ముందుగా రుతురాజ్ గైక్వాడ్(26), తర్వాత డెవాన్ కాన్వే(47)లను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, అజింక్యా రహానే.. ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. శివమ్ దూబే నిధానంగా ఆడినా.. అజింక్యా రహానే ధాటిగా ఆడాడు. కానీ మోహిత్ శర్మ.. రహానే జోరుకు బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి అంబటి రాయుడు రాగా.. రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్లో శివమ్ దూబే వరుసగా రెండు సిక్స్లు బాదాడు. దాంతో చెన్నై విజయానికి చివరి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమయ్యాయి. మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో అంబటి రాయుడు 6, 4, 6 బాది క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి ధోనీ రాగా.. చెన్నై విజయానికి 14 బంతుల్లో 22పరుగులు అవసరమయ్యాయి.
కానీ ధోనీ గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో చెన్నై విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మహమ్మద్ షమీ వేసిన 14 ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. దాంతో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి.చివరి రెండు బంతులను జడేజా సిక్సర్, బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.