న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్కు మ్యాచ్ రిఫరీ భారీ జరిమానాను విధించారు. ఐపీఎల్ నిబంధనలకు విరుద్దంగా అంపైర్లపై విమర్శలు గుప్పించిన అశ్విన్పై మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాధ్ చర్యలు తీసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో గెలుపొందింది.
బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ అవార్డు అందుకున్న తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. అంపైర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. డ్యూ ఉందని అంపైర్లు బంతిని మార్చడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. ఇలా బంతిని మార్చడం తాను ఎప్పుడూ చూడలేదన్నాడు.

అంపైర్లు బంతిని మార్చడం చూసి షాక్కు గురయ్యానని తెలిపాడు. బౌలింగ్ టీమ్ అయిన తాము అడగకుండానే అంపైర్లు బంతిని మార్చడం ఏంటో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ విషయంపై అంపైర్ను అడగ్గా.. అలా చేసే అధికారం తమకు ఉందని చెప్పారని తెలిపాడు. ఇది తమకు అనుకూలమైన నిర్ణయమే అయినా.. ఇలా చేయడం తనకు నచ్చలేదన్నాడు.
ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ నిబంధనలకు విరుద్దంగా ఉండటంతో అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అశ్విన్ వ్యాఖ్యలు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2.7 ప్రకారం లెవెల్ 1 తప్పిదంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ అధికారులను, అంపైర్లను, నిబంధనలపై ఎవరూ కూడా విమర్శలు చేయవద్దు.
ఇదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే(38 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(38), ధోనీ(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 32 నాటౌట్) విజయం కోసం పోరాడారు.