చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో అద్భుత విజయాన్నందుకున్న కోల్కతా నైట్రైడర్స్కు గట్టి షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు కారణమవ్వడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఈ సీజన్లో రెండో సారి స్లో ఓవర్ రేట్కు కేకేఆర్కు కారణం కావడంతో నిబంధనల ప్రకారం భారీ జరిమానా విధించారు.
కెప్టెన్ నితీశ్ రాణాకు రూ.24 లక్షల జరిమానా విధించగా.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా ఆటగాళ్లందరికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే దాన్ని పెనాల్టీగా విధించారు. నిర్ణీత సమయం కన్నా కేకేఆర్ ఒక ఓవర్ తక్కువ వేసింది. ఇక ఈ ఓవర్ను రూల్స్ ప్రకారం కేకేఆర్ సర్కిల్ బయట నలుగు ఫీల్డర్లతోనే పూర్తి చేయించింది.

ఈ సమయంలో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా అంపైర్లతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. మ్యాచ్ అనంతరం నితీశ్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో వదిలేసారు.
ఐపీఎల్లో ప్రతి జట్టూ 20 ఓవర్ల బౌలింగ్ కోటాను 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు స్ట్రాటజిక్ టైమ్ ఔట్లు, డీఆర్ఎస్ తీసుకోవడానికి, అంపైర్లు రివ్యూ తీసుకోవడానికి పట్టిన సమయాన్ని ఈ గంటన్నర నుంచి మినహాయిస్తారు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకుంటే.. తొలిసారి కెప్టెన్కు రూ.12 లక్షలు విధిస్తారు.
రెండో సారి రిపీట్ అయితే కెప్టెన్కు 24 లక్షలతో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే దాన్ని జరిమానాగా వసూలు చేస్తారు. మూడోసారి రిపీట్ అయితే మాత్రం ఆ జట్టు కెప్టెన్కు రూ.30 లక్షల జరిమానా విధించడంతోపాటు.. ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ.12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
నిషేధం నుంచి తప్పించుకోవడం కోసం కెప్టెన్ మరొకరికి నాయకత్వ పగ్గాలు అప్పగించినప్పటికీ.. అతడికే నిషేధం వర్తిస్తుంది. కెప్టెన్సీ మార్పు విషయమై బీసీసీఐకి లిఖితపూర్వక సమాచారం మాత్రం మినహాయింపు ఉంటుంది.