
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చాడు. గాయంతో దాదాపు రెండేళ్లు ఆటకు దూరమైన ఆర్చర్ సౌతాఫ్రికా టీ20 లీగ్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మోచేతి శస్త్ర చికిత్సతో ఆటకు దూరమైన ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్.. సరిగ్గా 541 రోజుల తర్వాత ప్రోఫెషనల్ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన ఎంఐ కేప్టౌన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోఫ్రా ఆర్చర్.. రాజస్థాన్ రాయల్స్కు చెందిన పార్ల్ రాయల్స్ టీమ్తో మంగళవారం జరిగిన ఆరంభ మ్యాచ్లో సత్తా చాటాడు.
4 ఓవర్లు వేసిన ఆర్చర్ మూడు వికెట్లతో రాయల్స్ టీమ్ పతనాన్ని శాసించాడు. రాయల్స్ కెప్టెన్ డెవిడ్ మిల్లర్(42)తో పాటు ఓపెనర్ విహన్(3), ఆడమ్స్(0)లను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. బ్యాటింగ్లో జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిస్(41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 70 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఎంఐ కేప్టౌన్ 8 వికెట్లతో పార్ల్ రాయల్స్ను ఓడించి శుభారంభం చేసింది.
ఇక ఐపీఎల్ 2022 సీజన్లో జోఫ్రా ఆర్చర్ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతను గాయంతో సీజన్ మొత్తం ఆడడని తెలిసినా భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకుంది. ఇక జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్నెస్ సాధించి సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తా చాటడంతో ముంబై ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.