న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ టీమ్ అరుదైన ఘనతను అందుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకుండా భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డును అధిగమించింది.
2018 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ముంబై ఇండియన్స్ ఈ ఘనతను అందుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఇలా జరగడం చాలా అరుదు.

లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది.కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్లతో 26), ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్కు తోడుగా .. యశ్ థాకూర్ మూడు వికెట్లు, మోహ్సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నోసూపర్ జెయింట్స్ 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది.
మార్కస్ స్టోయినీస్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుండగా.. కైల్ మేయర్స్(18), ప్రేరక్ మన్కడ్(3), కృనాల్ పాండ్యా(8), ఆయూష్ బదోని(1), నికోలస్ పూరన్(0) దారుణంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్ల్లో సూపర్ బ్యాటింగ్ చేసిన పూరన్.. కీలక ఎలిమినేటర్లో గోల్డెన్ డక్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి మార్కస్ స్టోయినీస్ పోరాడుతున్నాడు.