హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తమ తొలి మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ను ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. గత 10 ఏళ్లుగా రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ శుభారంభం అందుకోలేదు. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఐదు టైటిళ్లు గెలిచి సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచినా.. 2013 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో గెలవలేదు.
ఈ రికార్డే ముంబై ఇండియన్స్తో పాటు ఆ జట్టు అభిమానుల్లో ఆందోళన రెకిత్తిస్తోంది. చివరిసారిగా ముంబై తమ ఫస్ట్ మ్యాచ్ను 2012 సీజన్లో ఆర్సీబీపై నెగ్గింది. ఆ తర్వాత వరుసగా 10 సీజన్లు జరిగినా శుభారంభం అందుకోలేదు. 2013 సీజన్లో ఆర్సీబీతో తొలి మ్యాచ్లో 2 పరుగులతో ఓడిన ముంబై చివరకు ఛాంపియన్గా నిలిచి తొలి టైటిల్ను అందుకుంది. 2014 సీజన్లో కేకేఆర్తో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన 41 రన్స్తో ఓటమిపాలైంది.

2015లో మళ్లీ కేకేఆర్తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడిన ముంబై.. 7 వికెట్లతో ఓడి.. చివరకు ఛాంపియన్గా నిలిచి రెండో టైటిల్ను గెలుచుకుంది. 2016లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మళ్లీ సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. రైజింగ్ పుణె సూపర్ జేయింట్స్ చేతిలో కంగుతిన్నది.
ఇక 2017, 18, 19, 20, 21, 22 సీజన్లలో కూడా ముంబై శుభారంభాన్ని అందుకోలేదు. కానీ 2017, 19, 20 సీజన్లలో టైటిల్ గెలుచుకొని సత్తా చాటింది.
దాంతో తొలి మ్యాచ్ ఓడితే తాము టైటిల్ గెలుస్తామని ముంబై ఫ్యాన్స్ సెంటిమెంట్గా ఫీలయ్యేవారు. కానీ గత రెండు సీజన్లుగా ఆ సెంటిమెంట్ రీపిట్ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. టైటిల్ దేవుడెరుగు తాము ప్రతిష్టాత్మకంగా భావించే ఆర్సీబీతో ఓటమిని ముంబై అభిమానులు ఊహించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ చెత్త రికార్డు సెంటిమెంట్ రిపీట్ కావద్దని కోరుకుంటున్నారు. మైదానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్నేహంగా ఉన్నా.. వారి అభిమానులకు మాత్రం అస్సలు పడదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ సూపర్ స్టార్ల అభిమానుల మధ్య పెద్ద గొడవే జరుగుతూ ఉంటోంది.
ఈ క్రమంలోనే ఆర్సీబీ, ముంబై మ్యాచ్కు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. ఈ రోజు(ఆదివారం) రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ముంబై తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మరీ గత సెంటిమెంట్ను ముంబై రిపీట్ చేస్తుందా? లేక బ్రేక్ వేస్తుందా? అనేది చూడాలి.