చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి మాస్టారు అవతారమెత్తాడు. యువ ఆటగాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్లతో ధోనీ ప్రత్యేకంగా మాట్లాడాడు.
తన అనుభవాలను పంచుకోవడంతో పాటు కొన్ని సలహాలు, సూచనలను యువ ఆటగాళ్లకు అందజేశాడు. ధోనీ క్లాస్ను సన్రైజర్స్ ఆటగాళ్లు చాలా శ్రద్దగా విన్నారు. సన్రైజర్స్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, సన్విర్ సింగ్, కార్తీక్ త్యాగీతో పాటు ఇతర సన్రైజర్స్ యువ ఆటగాళ్లు ధోనీతో ముచ్చటించారు. అతనితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ధోనీ క్లాస్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

'మాస్టారు మాస్టారు.. మా మనసును గెలిచారు'అని అభిమానులు ధోనీని కొనియాడుతున్నారు. ఇక ధోనీ ఇలా యువ ఆటగాళ్లతో మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత రెండు సీజన్లుగా మ్యాచ్లు ముగిసిన వెంటనే అతని చుట్టూ యువ ఆటగాళ్లు చేరడం.. ధోనీ తన అనుభవాలను పంచుకోవడంతో పాటు పలు సూచనలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ధోనీనే కాదు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఇలానే యువ ఆటగాళ్లతో మాట్లాడుతున్నారు.
ఇక ధోనీ చేస్తున్న పనిపై కామెంటేటర్, సీఎస్కే మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసలు కురిపించాడు. జియో సినిమాలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఊతప్ప.. యువ ఆటగాళ్లకు ఇదో గోల్డెన్ చాన్స్ అని తెలిపాడు. ధోనీని ప్రశ్నలు అడగడం, అతని అనుభవాలు తెలుసుకోవడం వారికి దక్కిన గొప్ప అవకాశమన్నాడు.
'చెన్నైతో మ్యాచ్ అనగానే ప్రతీ యువ ప్లేయర్ ధోనీతో ఐదు నిమిషాలు గడుపబోతున్నామని, అతన్ని ఏం ప్రశ్నలు అడగాలని మనసులో అనుకుంటారు. రెండు నిమిషాలు మాట్లాడిన అతని స్ట్రాటజీలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ధోనీ కూడా యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం గొప్ప విషయం.
యువ ఆటగాళ్లే కాకుండా.. కొన్ని ఫ్రాంచైజీల కోచ్లు, కెప్టెన్లు కూడా ధోనీ సలహాలు తీసుకోవాలి. ఎలాంటి ఆటగాళ్లను తీసుకోవాలి? హోమ్ కండిషన్స్లో ఎలా ఆడాలనేదానిపై ధోనీతో చర్చించాలి. చాలా జట్లు ఇంగిత జ్ఞానం లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.