అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల జారీ విషయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. టికెట్ల కోసం అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి తలెత్తింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఫిజికల్ టికెట్ల కోసం భారీ క్యూ కట్టారు. టికెట్ల కోసం గంటల కొద్ది లైన్లలో నిరీక్షిస్తున్నారు.
లక్ష సీటింగ్ కేపాటిసి కలిగిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ వేదికగా అమ్మేసారు. పేటీఎమ్ ఇన్సైడర్ యాప్ ద్వారా టికెట్లన్నీ అమ్ముడు పోగా.. ఫిజికల్ టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. రెండు మ్యాచ్లకు సంబంధించిన అభిమానులు రావడంతో పరిస్థితి చేయి ధాటిపోయింది.

అభిమానులు కంట్రోల్ చేసే విషయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 45 డిగ్రీల ఎండలో జనాలు టికెట్ల కోసం బారులు తీరారని, మ్యాచ్ కోసం అభిమానులు తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
బీసీసీఐతో పాటు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారుల తీరుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని మండిపడుతున్నారు. అయినా ఆన్లైన్ వేదికగా టికెట్లు అమ్మిన తర్వాత ఫిజికల్ టికెట్లు ఎందుకని నిలదీస్తున్నారు. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. బీసీసీఐ ఇంకా పాత పద్దతిని కొనసాగించడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తున్నారు.

చాలా టికెట్లు బ్లాక్లో అమ్మినట్లు కూడా జీసీఏపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్కే అభిమానులను కట్టడి చేయకుంటే.. వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ పరిస్తితి ఏందని ప్రశ్నిస్తున్నారు. తలుచుకుంటేనే భయం వేస్తుందని, అభిమానుల ప్రాణాలతో బీసీసీఐ చెలగాటం ఆడుతుందని మండిపడుతున్నారు.
నేటి(శుక్రవారం) రాత్రి 7.30 గంటలకు జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.