
కొచ్చి: ఐపీఎల్ 2023 మినీ వేలం ప్రారంభమైంది. కేరళలోని కొచ్చి వేదికగా జరుగుతున్న ఈ మినీ ఆక్షన్కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులతో పాటు 10 ఫ్రాంచైజీల ప్రతినిథులు, కీలక సభ్యులు హాజరయ్యారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లూ కలర్ ఫార్మల్ డ్రెస్స్లో తళక్కుమన్న కావ్య పాప.. జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల కోసం వేలంలో తగ్గేదేలేదంటూ దూసుకెళ్తోంది. టీమ్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీ ధరన్తో కలిసి ఈ మెగా వేలానికి వచ్చిన కావ్య పాప ఇంగ్లండ్ ప్లేయర్ హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో హరీ బ్రూక్ సత్తా చాటడంతో అతని కోసం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. తగ్గేదేలే అన్నట్లు ఈ యువ ప్లేయర్ కోసం పోటీ పడటంతో భారీ ధర పలికాడు. చివరకు రూ. 13.25 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్కు సొంతమయ్యాడు. రూ.1.50 కోట్ల కనీస ధరతో మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్న హరీ బ్రూక్.. 13 రెట్లు ఎక్కువ పలికి జాక్పాట్ కొట్టాడు. ఐపీఎల్లో అవకాశం అందుకోవడం హరీ బ్రూక్కు ఇదే తొలిసారి.
అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోసం కావ్య పాప కనీసం బిడ్ కూడా వేయలేదు. దాంతో అతను రూ.2 కోట్ల కనీస ధరకే గుజరాత్ టైటాన్స్కు చిక్కాడు. మయాంక్ అగర్వాల్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో తీవ్రంగా పోటీపడి మరి దక్కించుకుంది. తక్కువ ధరకు లభించినా కేన్ విలియమ్సన్ను తీసుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.