
కొచ్చి: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ యువ ప్లేయర్ హరీ బ్రూక్ను రూ.13.25 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ ఇంగ్లండ్ ప్లేయర్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీపడటంతో రూ.1.50 కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతని ధర అమాంతం పెరిగింది. అయితే ఐపీఎల్ అనుభవం లేని హరీ బ్రూక్ కోసం సన్రైజర్స్ ఇంత భారీ ధర చెల్లించడం ఘోర తప్పిదమనే విమర్శలు వస్తున్నాయి. కేవలం టీ20 ప్రపంచకప్ ప్రదర్శనతో అతన్ని తీసుకోవడం జట్టుకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. భారత పిచ్లపై ఏ మాత్రం అనుభవం లేని ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకోవడం పిచ్చి నిర్ణయమని విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా సన్రైజర్స్కు ఎయిడెన్ మార్క్రమ్, గ్లేన్ ఫిలిప్స్ వంటి ఓవర్ సీస్ మిడిలార్డర్ బ్యాటర్లు ఉన్నారని, అయినా బ్రూక్ తీసుకోవడం ఏంటని తప్పుబడుతున్నారు. అయితే స్ట్రాటజీ ప్రకారమే హరీ బ్రూక్ను కొనుగోలు చేశామని సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా తెలిపాడు. ఆక్షన్ బ్రేక్ టైమ్లో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన బ్రియాన్ లారా.. హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్లను కొనుగోలు చేయడానికి గల కారణాలను వెల్లడించాడు.

అంతేకాకుండా హరీ బ్రూక్కు వికెట్ కీపింగ్ చేసే సామర్థ్యం ఉందని, బ్రెండన్ మెక్కల్లమ్ పర్యవేక్షణలో బజ్ బాల్ కాన్సెప్ట్లో టెస్ట్ల్లో అదరగొట్టాడని చెప్పాడు. బ్రూక్తో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం పెరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. లీడర్ షిప్ క్వాలిటీస్తో పాటు భారత పిచ్లపై మంచి అవగాహన ఉండటంతోనే మయాంక్ అగర్వాల్ను తీసుకున్నామని తెలిపాడు. ఇక మయాంక్ అగర్వాల్ కోసం రూ.8.25 కోట్లు ఖర్చు చేసిన సన్రైజర్స్ ఇద్దరి ప్లేయర్ కోసమే రూ.21.50 కోట్లు ఖర్చు చేసింది.